నలుగురు ఆల్ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్
భారత్లో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ బుధవారం నాడు భగ్నం చేసింది. అల్ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేసింది. వీరిలో ఒకరిని ఢిల్లీలో, మరొకరిని నొయిడాలో, మరో ఇద్దరిని గుజరాత్లోని అహ్మదాబాద్, మోడాసాలో అరెస్టు చేసింది. అరెస్టు చేసిన ఉగ్రవాదులను మహమ్మద్ ఫైక్, మహమ్మద్ ఫర్దీన్, సైఫుల్ ఖురేషి, జీషన్ అలీగా గుర్తించారు. వీరంతా 20 – 25 ఏళ్ల లోపు వారేనని, దేశంలో భారీ కుట్రలకు వీరు ప్లాన్ చేశారని గుజరాత్ పోలీసులు తెలిపారు. వీరు సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు సంబంధాలు నెరపుతున్నట్టు గుర్తించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, ఢిల్లీ పోలీసులు సైతం గతేడాది ఆగస్టులో అల్ఖైధా అనుబంధ టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు చేశారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 14 మందిని అరెస్టు చేశారు. వీరికి వివిధ రకాల ఆయుధాల వాడకంలో శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు.