3వేలకు పైగా తగ్గిన రేట్లు
అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్లో ఆల్టైమ్ గరిష్ఠానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త దిగొచ్చింది. 10 గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.3వేలు తగ్గింది. బుధవారం 11 గంటల సమయంలో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,700గా ఉంది. అటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.98,720గా ఉంది. మంగళవారం నాటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ ట్రేడింగ్లో జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్ ధర ఇంట్రాడేలో రూ.99,358 వద్ద సరికొత్త రికార్డును తాకిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ ధర కూడా తగ్గుముఖం పట్టింది. నేడు రూ.96,500 వద్ద ప్రారంభమైన ఈ ధర.. ఇంట్రాడేలో రూ.95,457 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 3,320.40 డాలర్లు పలికింది. నిన్న ఈ ధర 3,467 డాలర్లు దాటింది. చైనాతో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో అగ్రరాజ్య మార్కెట్లు లాభాలను దక్కించుకున్నాయి. డాలర్ విలువ కూడా బలపడుతోంది. ఈ పరిణామాలన్నీ బంగారం ధరపై ప్రభావం చూపించాయని నిపుణులు చెబుతున్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్లు పసిడి ధరను ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతికంగా చూస్తే.. రానున్న రోజుల్లో పుత్తడి మరింత దిగి రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఏప్రిల్ 30న అక్షయతృతీయ నాటికి బంగారం ధరలు తగ్గకపోతే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.