- దేశాన్ని అగాధంలోకి నెడుతున్న విధానాలు
- కేంద్ర ప్రభుత్వంపై సోనియా విమర్శలు
ప్రస్తుత ప్రభుత్వ మూడు అంశాల ఎజెండా విద్యా రంగంలో వినాశకరమైన పరిణామాలకు దారితీస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. సెంట్రలైజేషన్, కమర్షియలైజేషన్, కమ్యూనలైజేషన్ అనే మూడు సి… లు దేశ విద్యా విధానాన్ని శాసిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత దశాబ్దంలో అధికారాన్ని కేంద్రీకరించడం, విద్యను వ్యాపారంగా చేయడం, పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలు మతతత్వం చేయడం వారికి తెలిసిన పక్రియ అని సోనియా విమర్శించారు. తాజాగా ఒక పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె దేశంలోని పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ పనితీరు కేంద్రీకరణ దిశగా సాగుతోందని, అత్యంత హానికరమైన పరిణామాలు విద్యా రంగంలోనే ఉన్నాయని సోనియా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా మంత్రులతో కూడిన కేంద్ర విద్యా సలహా మండలి సమావేశం 2019 సెప్టెంబర్ నుండి ఇప్పటివరకూ జరుపలేదన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలతో కనీసం ఒక్కసారైనా చర్చలు జరిపారా అని ఆమె నిలదీశారు. విద్య కేంద్ర రాష్ట్రాల్లో ఉమ్మడి అంశమైనా కేంద్ర ప్రభుత్వం ఒంటరి పోకడలకు పోతోందని విమర్శించారు. విద్యావ్యవస్థ ద్వారా చిన్నారుల్లో విద్వేషాన్ని పెంచడమనే ఆరెస్సెస్, బీజేపీ సుదీర్ఘ కాంక్షను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారని ఆమె అన్నారు. మహాత్మా గాంధీ హత్యోదంతాన్ని, మొగలుల పాలనా విషయాలను పుస్తకాల నుంచి ఎందుకు తొలగించారన్నారు. తగిన నైపుణ్యాలు లేకపోయినా ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో వారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నవారికే కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని సోనియా ఆక్షేపించారు. విద్యావ్యవస్థపై సాగుతున్న ఈ మారణహోమం వెంటనే ఆగిపోవాలని సోనియా తన వ్యాసంలో కోరుకున్నారు.