- అసిస్టెంట్ పోలీస్ సూపరిండెంట్ చైతన్య రెడ్డి వెల్లడి!!
- 18 సంవత్సరాలలోపు పిల్లలకు కల్లు విక్రయాలు చేయవద్దు
- యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు బానిసలు కాకూడదు
- ఒక్కోకల్లు దుకాణంలో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
కామారెడ్డి మున్సిపల్ పరిధి దేవునిపల్లి శివారులోని కల్తీకల్లు విక్రయిస్తున్న 5 దుకాణాలను మూసి వేసి ఎక్సైజ శాఖ జారీ చేసిన లైసెన్స్ యజమానులపై ఎన్డిపిఎస్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదు చేయడం జరిగిందని కామారెడ్డి ఏఎస్ పి చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం ఏఎస్పీ కార్యాలయంలో ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో మాట్లాడారు. కల్లు విక్రయదారులు చట్టంలోని నిబంధనలను తూచా తప్పకుండా పాటించి వ్యాపారాలు నిర్వహించుకోవాలని చట్టం పరిధి దాటి వ్యాపారం చేస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎవరి ఒత్తిడిలకు తల ఒగ్గేదిలేదని ఆమె స్పష్టం చేశారు.
18 సంవత్సరాల లోపు పిల్లలకు కల్లు విక్రయాలు చేయవద్దని చేస్తే చట్ట పరిధిలో కేసులు నమోదు చేసి శిక్షిస్తామని కల్లు ముస్తదారులతో ఇటీవలనే కామారెడ్డి ఎస్ పి కార్యాలయంలో సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిబంధన మేరకు కల్లు విక్రయాలు జరుపుకోవాలని అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ మంగళవారం సాయంత్రం కల్తీకల్లు విక్రయదారులు చిన్న పిల్లలకు కల్లు విక్రయించడం జరిగింది. ఫోటోలు ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించి కళ్ళు దుకాణాలకు తాళం వేయించడం జరిగిందని తెలిపారు. అలాగే ఒక్కోకల్లు దుకాణంలో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగిందని తెలిపారు. కల్లు దుకాణాల ముందు 18 సంవత్సరాల లోపు పిల్లలకు కల్లు అమ్మబడదు. ఇదే క్రమంలో కల్లు దుకాణాల్లో మద్యం సేవించడం నేరం అని తెలియజేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించినప్పటికీ రెండు కల్లు దుకాణాల ముందు మాత్రమే బ్యానర్ ఏర్పాటు చేసుకున్నారని మిగతా ముగ్గురు చేసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.
కళ్ళు విక్రయదారులు స్వచ్ఛమైన కల్లును ప్రజలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి ప్రభుత్వం కేటాయించిన సమయాలలో కల్లు విక్రయించుకోవచ్చన్నారు. చిన్న పిల్లలు కల్తీ కల్లుకు అలవాటు పడితే వారి భవిష్యత్తు దానికి బానిసై వారి కుటుంబాలు జీవితాలు అనారోగ్యాల పాలై వారి ఆర్థిక స్థితిగతులు దిగజారిపోయే ప్రమాదం ఉందన్నరు. బడికి వెళ్లాల్సిన వయసులో ఉన్న పిల్లలు ఒకసారి కల్తీకల్లుకు అలవాటు పడితే దానిని మరిచిపోవడం కష్ట సాధ్యమని అందువల్లనే 18 సంవత్సరాలలోపు పిల్లలకు కల్లు విక్రయించ వద్దని హెచ్చరించడం జరిగిందన్నారు. కల్తీ కల్లు తాగడం అలవాటు పడితే నాడీ వ్యవస్థ కండరాల వ్యవస్థ మతిస్థిమితం వచ్చే ప్రమాదం ఉందని కల్తీకల్లు సేవించని ఎడల మతిస్థిమితం తప్పి పిచ్చిపిచ్చిగా తయారయ్యే ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నందున కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరు చనిపోకూడదన్న ఉద్దేశంతో సంబంధిత ఆర్ అండ్ బి అధికారులను ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో రోడ్డు నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని సూచించడంతో ఇంజనీర్లు రోడ్డు శాస్త్రీయంగా సాంకేతికంగా లోపాలు ఉంటే సరిచేయాలని తెలియజేయడంతో ఇంజనీర్లు రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు జరిగే ప్రాంతంలో రోడ్లను వాహనాలకు అనుగుణంగా మార్చడంతో సాధ్యమైనంత వరకు రోడ్డు ప్రమాదాలను నివారించడం జరిగిందని ఏఎస్పీ తెలియజేశారు. గంజాయి, అల్ఫాజోమ్ డైజోఫామ్ విక్రయాలు జరిపితే కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు.
యువత మత్తు పదార్థాలకు చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని ఉజ్జలమైన భవిష్యత్తు యువతకు ఉందన్నారు. మానవ వనరులు పుష్కలంగా ఉన్న మన ప్రాంతంలో నైపుణ్యంతో కూడిన విద్యను సమృద్ధిగా వనరులు ఉన్న ఉపాధి మార్గాన్ని ఎంచుకొని యువత వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.