- బాధితులకు అండగా గులాబీ జెండా
- రజతోత్సవ వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్
- కాశ్మీర్ ఉగ్రదాడి మృతులకు నివాళి
తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్లా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరణించిన భారతీయులకు సభా ప్రాంగణం వద్ద రెండు నిమిషాల పాటు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి.. బోధించు, సవిూకరించు, పోరాడు అనే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించాలనే నినాదంతో పురుడు పోసుకుంటున్న సంస్థ టీఆర్ఎస్ అని తెలిపారు. హిమాలయాల స్థాయికి తెలంగాణను తీసుకొచ్చి పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను అద్భుతంగా నిర్వహిస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. దేశం మొత్తంలో గుర్తింపు తెచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని చెప్పారు. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు కష్టమొచ్చినా తెలంగాణ భవన్కు వస్తున్నారని అన్నారు. జనతా గ్యారేజీ మాదిరిగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరూ గులాబీ జెండాకు జై కొడుతున్నారని చెప్పారు. రజతోత్సవ సభకు వరంగల్ వేదిక కావడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. ఎల్కతుర్తి సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. 30-40 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. 10 లక్షల వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, వెయ్యికి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు విూద నమ్మకం లేదని కేటీఆర్ అన్నారు. అందుకే సభ కోసం 200 జనరేటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులందరూ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఎల్కతుర్తి సభ భారీ బహిరంగ సభగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను చూడాలె… ఆయన మాట వినాలని ప్రజలు ఉర్రూతలు ఊగుతున్నారని అన్నారు. బండి ఎనక బండి గట్టి పద్ధతిలో పెద్ద ఎత్తున సూర్యాపేట రైతన్నలు వస్తున్నారని తెలిపారు. సభ కోసం 2వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 27న 12796 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కదం తొక్కిన ఉత్సాహంతో ఛలో వరంగల్ సభకు చేరుకుందామని అన్నారు. కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడుదామని అన్నారు. 11 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ సందేశాన్ని గులాబీ సైనికులు ప్రతి గ్రామానికి చేర్చాలని సూచించారు.

