కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్
కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 14ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారని గుర్తుచేశారు. 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలనుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటామని తెలిపారు. అస్తిత్వం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందన్నారు. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచీ లెక్క పని చేస్తుందన్నారు. డీలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు, కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాలతో దక్షిణాది రాష్ట్రాలకు అనేక నష్టాలు కలుగుతాయని స్పష్టంచేశారు. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నా మని, ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు. దేశానికి 36 శాతం జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. డీలిమిటేషన్ కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడమే కాదు.. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. ఎన్డీఏ పాలనలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష మరింత పెరిగిందన్నారు. వివక్షను కొనసాగించేందుకు డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొస్తుందన్నారు. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేయడం ఒక ఉదాహరణ అని.. జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్ జరిగితేనే దేశ సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.