- రంగారెడ్డి జిల్లా గండిపేట్ లో భూమాయ
- కోట్లాది రూపాయల విలువైన భూమి మాయం
- సర్వే నెంబర్ 147లో 31ఎకరాల 28గుంటల ప్రభుత్వ భూమి
- కొంత భూమిని కబ్జాకు పాల్పడ్డ ప్రైవేట్ వ్యక్తులు
- సర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం
- నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన మున్సిపల్, హెచ్ఎండీఏ
- ప్రేక్షకపాత్రలో రెవెన్యూ, హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు
- 2021లో 147ను నిషేధిత జాబితాలో పొందుపర్చాలని ఆదేశాలు
- రెండు పర్యాయాలు జిల్లా రిజిస్ట్రార్కు లేఖలు..
- ఆదేశాలను బేఖాతర్ చేసి, ప్రైవేట్ సంస్థలకు అట్టగట్టిన హెచ్ఎండీఏ
భాగ్యనగరంలో భూముల ధరలు రూ.కోట్లల్లో పలుకుతున్నాయి. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏ మారుమూల ప్రాంతంలో చూసిన ల్యాండ్ చాలా కాస్లీ అయిపోయింది. ఈ నేపథ్యంలో అక్రమార్కులు కన్ను భూములపై పడింది. ‘అన్నం పెట్టే వాడికన్నా సున్నం పెట్టే వాళ్లే ఎక్కువ’ అన్న చందంగా కబ్జాకోరులు రోజు రోజుకు ఎక్కువైపోయారు. ఇందులో భాగంగా రాజధాని పరిధిలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, దేవాలయ భూములు మాయం అవుతున్నాయి. ఏడ భూమి ఖాళీ కనపడితే గద్దల్లా అక్కడికొచ్చి వాలిపోతున్నారు. అక్కడ కర్చీఫ్ వేసి ఆ భూమిని కబ్జా చేస్తున్నారు. భూముల విలువ పెరిగి పోవడంతో అక్రమార్కులు అతి తెలివిని ఉపయోగిస్తున్నారు. రాజకీయ, అధికార బలంతో గవర్నమెంట్ భూములను పొతం పెడుతున్నారు. విలువైన సర్కారు, అసైన్డ్ భూములను సైతం చెరబడుతున్నారు. కోట్లాది రూపాయలు పలుకుతుండడం, రియల్ ఎస్టేట్ బాగా పెరిగి పోవడంతో జాగలను కొట్టేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సపోర్టుతో కబ్జాకోరులు భూములను చెరపడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే బడా బిల్డింగ్ లను నిర్మిస్తున్నారు. భారీగా లంచాలు అందజేసి ఈజీగా పని పూర్తిచేసుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల హస్తం ఉన్నట్లు వీరి అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 147లో 31 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమి కలదు. సర్వే నెంబర్లు 147/1లో 28గుంటలు, 147/2లో 31ఎకరాల ప్రభుత్వ భూమి కలదు.. రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ డి. అమోయ్ కుమార్ లెటర్ నెం. (E5/2825/2021, Dt. 10-06-2021, E5/2825/2021, Dt. 29-09-2021) జిల్లా స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్కు హైకోర్టు ఆదేశాల మేరకు (రిట్ పిటిషన్ నెం..WRIT APPEAL Nos.343 of 2015; 232 of 2012; 352 and 785 of 2013) రాజేంద్రనగర్ డివిజన్లోని శేరిలింగంపల్లి మండలం, గండిపేట్ మండలంకు సంబంధించిన సర్వేనెంబర్లు పొందురుస్తూ.. నిషేదిత జాబితాలో పెట్టడానికి ఆదేశాలు జారీ చేశారు. తదనంతరం 28 జనవరి 2021లో డ్యాకుమెంట్ నెం. 1918/2021 హెచ్ఎండీఏ అధికారులు గండిపేట మండలం, కోకాపేట గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 147లోని భూమి సుమారు 14,883.97 స్వేర్ యాడ్స్ను సోమ ఎంటర్ప్రైసెస్ లిమిటెడ్ సంస్థకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. హెచ్ఎండీఏ నోటిఫికేషన్ 2006 ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తుంది.. 2006లో నోటిఫకేషన్ వేసి 28 జనవరి 2021లో రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి.. తదనంతరం కూడా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా రిజిస్ట్రార్కు సర్వే నెంబర్ 147ను నిషేధిత జాబితాలో పొందుపర్చమని రెండు పర్యాయాలు (జూన్, సెప్టెంబర్ 2021) ఆదేశాలు జారీ చేశారు. కానీ, నిషేదిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 147 ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న.. ఈ విషయంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి గండిపేట తహసీల్దార్, హెచ్ఎండీఏ అధికారి సుదర్శన్ ఎర్రోళ్ల ను వివరాలు కోరగా, అట్టి వివరాలు లేవని సమాధానం ఇచ్చారు. సంబంధిత అధికారుల అట్టి వివరాలు లేకపోవడం పలు అనుమానాలకు తావీస్తుంది..

కాగా, సర్వే నెంబర్ 147లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టం జరుగుంది. ఈ నిర్మాణాలకు రెవెన్యూ, మున్సిపాలిటీ నుండి అనుమతులు ఉన్నాయంటూ అక్రమార్కలు యధేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అయితే వీరికి రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల నుంచి పూర్తి అండదండలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. సర్కారు భూమి అని తెలిసి దాన్ని కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతుంటే మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారో అంతుచిక్కడం లేదు. ప్రభుత్వ భూములను మింగుతున్న కబ్జాకోరులను కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నారంటే ఇక్కడ్నే అర్థం చేసుకోవచ్చు. తప్పు చేశారని రుజువు అయినప్పటికి వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారంటే వారి వెనుక ఎంత బలం ఉందో.. లేక అధికారులకు ఎంత డబ్బు ముట్టిందోనన్న అనుమానాలు రాకమానదు. హైదరాబాద్ లో భూముల రేట్లు బాగా ఉండడంతో ఆఫీసర్లతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని వాటిని ఆక్రమించేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అధికారులను మచ్చిక చేసుకొని ఖరీదైన భూములను కొల్లగొట్టి ప్రైవేట్ నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతుండడం విడ్డూరం…
మరోపక్క గవర్నమెంట్ జాగలో యధేచ్ఛగా ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన మున్సిపాలిటీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇక సర్కారు పెద్దలు, ఉన్నతాధికారులు.. చొరవ తీసుకొని కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీనపర్చుకొని, అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారించి, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ముడుపులు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అండగా నిలిచిన అధికారులను సస్పెండ్ చేయాలని స్థానికులు ప్రజలు కోరుతున్నారు.
గండిపేట మండలంలో అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..