- ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు కేటాయించిన లావణిపట్టా భూమి స్వాహా
- రాజకీయ పలుకుబడితో రైతుల నుండి అగ్రిమెంట్ చేసుకొని పట్టా భూమిగా మార్పు
- సర్వే నెంబర్ 107, 85, 124లలో లావణిపట్టా భూమిని పట్టాగా మార్చిన వైనం
- కోట్ల రూపాయల విలువైన భూమిని కొల్లగొట్టిన కనకమామిడి శ్రీనివాస్
- గతంలో ప్రభుత్వ భూమిలో వెంచర్ చేసి అమాయకులకు అంటగట్టిన వైనం
- సుమారు 700 ప్లాట్లు చేసి అడ్డగోలుగా అమ్ముకున్న మాజీ సర్పంచ్ శ్రీనివాస్
- గతంలో అమాయకుల నుండి దాదాపు రూ.3లక్షల వరకు అక్రమ వసూళ్లు
- ఇది వరకే కథనం ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్
కొందరూ భూములను చూసే కడుపు నింపుకుంటున్నారు. తిమ్మిని బమ్మి చేసో, ఏదో రకంగా తమ వశం చేసుకోవాలని పేదలు, నిరుపేద రైతులు, అమాయక ప్రజల నోట్లో మట్టికొట్టి వాళ్ల భూములను కొల్లగొడుతున్నారు. అధికారం, డబ్బు పలుకుబడితో భూములను కబ్జాచేసి ఉల్టా వారినే అదరగొడుతున్నారు. ‘ఆవులు పోట్లాడుకొని లేగల కాళ్ళు విరగదొక్కినట్లు’ బలిసినోళ్లు, రాజకీయ నాయకులు నిరుపేద, బక్క చిక్కిన అన్నదాతలను మోసం చేసేందుకు పోటీపడిపడుతున్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో చూసిన భూముల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అందరికీ ఆ మట్టిపైనే మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను అమాంతం మింగేస్తున్నారు. భారీగా ముడుపులు అప్పగించి రికార్డులనే మాయం చేస్తున్నారు. అధికారుల అండతో పొలిటికల్ లీడర్లు అందినకాడికి దోచుకొంటున్నారు. వాడు, వీడు అని తేడా లేదు ఖద్దర్ చొక్కా వేసుకునే ప్రతి ఒక్కడూ భూములను పొతం పెట్టేవారే. అధికార పార్టీ వారైతే మరికొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు. “అవినీతి ఆరోపణలు ఎదుర్కోని ఒకసారి సస్పెండ్ అయినా ఇతగాడి బుద్ధి మారలేదు. తాను ఒక గ్రామ సర్పంచ్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా.. గ్రామ ప్రథమ పురుడు అనే పదానికి మచ్చ తెస్తున్న ఒక అవినీతి సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోయినసారి 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు లే అవుట్ కోసం అనుమతులు ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి తీసుకుని వచ్చింది ఆదాబ్.. తన బుద్ధి మార్చుకోకుండా
కనకపు సింహాసనమున..
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!
అన్న పద్దతిన సర్వే నెంబర్ 107, 85, 124లలో లావణి పట్టా భూమిని పట్టాగా మార్చి డబ్బులు దండుకున్న వ్యవహారాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఆదాబ్ హైదరాబాద్…
పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, తోల్ కట్ట గ్రామం సర్వే నెంబర్ 107, 85, 124 లలో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు లావణి పట్టాలను కేటాయించడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన రైతుల పరిస్థితులను అవకాశంగా మార్చుకొని మాజీ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ వారికి రూ. లక్ష నుండి రూ. 2 లక్షలు చెల్లించి సర్వే నెంబర్ 107, 85 లోని భూమిని అగ్రిమెంట్ చేసుకొని, రాజకీయ పలుకుబడితో కలెక్టర్ నుండి తహసీల్దార్ వరకు భారీ ఎత్తున ముడుపులు ఇచ్చి పట్టాగా మార్చిన ఘనుడు. అదేవిధంగా సర్వే నెంబర్ 124లో సుమారు 5 ఎకరాల లావణి పట్టాను పట్టాగా మార్చి కోట్ల రూపాయలు దండుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ భూమిలో యధేచ్ఛగా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. అసలు మాజీ సర్పంచ్ కనకమాడి శ్రీనివాస్ చేసిన అక్రమాలకు అండగా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులపై మరియు సర్పంచ్గా ఉన్న సమయంలో శ్రీనివాస్ ఆస్తి ఎంత.. ఇప్పుడు ప్రభుత్వ భూములపై లావాదేవీలు చేసి సంపాదించిన ఆస్తులు ఎంత అనే అంశాలపై పూర్తి ఆధారాలతో మరో కథనంతో మీ ముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం.