- బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
- గౌతాపూర్ ఎస్సీ కాలనీ మహిళల ఆందోళన
- అధికారుల నిర్లక్ష్యంతోనే మంచినీటి కష్టాలు
- వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న మహిళలు
ప్రభుత్వం మారిన ఏడాదిలోనే మంచినీటి కష్టాలు మొదలయ్యాయని, మిషన్ భగీరథ నీళ్లు బంద్ చేసి బాధపెడుతున్నారని బిందెలతో గౌతాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. మిషన్ భగీరథ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చిలిపిచేడ్ మండలం గౌతాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనిలో గత మూడు, నాలుగు రోజులుగా మిషన్ భగీరథ త్రాగునీరు రావడం లేదని వాపోయారు. తమ సమస్యను పట్టించుకోవడం లేదంటూ బుధవారం కాలనీ మహిళలంతా కలిసి గ్రామంలో ప్రధాన కూడలి వద్ద బిందెలతో ఆందోళన చేశారు.గ్రామంలో మూడు వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ రెండు ట్యాంకులు నింపి మరొక్క ట్యాంకును ఖాళీగా వదిలేస్తున్నారని, దీంతో కాలనీలో నీటి కష్టాలు తప్పడం లేదని, త్రాగునీటితో పాటు కనీస అవసరాలకు కూడా చుక్క నీళ్లు రావడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి త్రాగునీరు అందించాలని ఎస్సీ కాలనీ మహిళలు కోరారు.
గౌతాపూర్ గ్రామ కార్యదర్శి శ్రావణి వివరణ
గ్రామంలో నెలకున్న మిషన్ భగీరథ నీళ్ల సమస్యపై గౌతాపూర్ కార్యదర్శి శ్రావణిని ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరగా.. రెండు మూడు రోజుల్లో నుండి సమస్య ఉన్న మాట నిజమే.నీళ్లు రావడం లేదన్న సమస్య తమ దృష్టికి వచ్చిందని, తప్పకుండా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.