కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో తెలంగాణ జాగృతి మొదటి వరుసలో ఉంటుంది అని కవిత పేర్కొ న్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లులు ఆమోదం పొందితే మొక్కు చెల్లించుకుంటానని గతంలో ప్రకటన చేశానని. చట్టసభలు బిల్లలు ఆమోదించిన నేపథ్యంలో కొమురవెల్లిలో మొక్కు చెల్లించుకున్నానని తెలిపారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గి వేర్వేరు బిల్లును పెట్టిందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదం పొందిన రీత్యా ప్రభుత్వం తదుపరి అడుగు వేయాలని డిమాండ్ చేశారు. చట్టాలను కేంద్రం నుంచి ఆమోదించుకొని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆమోదించిన చట్టాలను ఎవరైనా కోర్టుల్లో సవాలు చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలి అని కవిత పేర్కొన్నారు. దేశంలో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్రాలు తెలంగాణతో సహా దాదాపు 10 ఉన్నాయన్నారు. ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అమలైన తర్వాత తెలంగాణలో 54 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలిగిపోయిన నేపథ్యంలో కోర్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదించాలని కోరారు. రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని తొలి నుంచి వాదిస్తున్నాం అని కవిత తెలిపారు. అసెంబ్లీ అవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమాజం పరిణితి చెందుతున్నా కొద్ది విస్మరించిన వర్గాలు ఒక్క చోటుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ బిల్లులు అంటే.. ఆ ఒక్క వర్గం లొల్లి కాదు ఇది అందరి లొల్లి అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కొమురవెల్లి మలన్నకు ప్రభుత్వం తరఫున కేసీఆర్ 130 ఎకరాల మాన్యం భూమిని అందించాలన్నారు. కేసీఆర్ హయాంలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. కొమురవెళ్లి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో చేసిన ఖర్చు రూ 50 కోట్లు.. తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయని అయిన ఒక రిజర్వాయర్కు మలన్న సాగర్ అని పేరు పెట్టుకోవడం జరిగింది అని కవిత గుర్తు చేశారు.

