- ఒప్పందంపై సంతకం చేసిన మంత్రులు పొన్నం, జూపల్లి
- కృషి చేసిన పొన్నంకు కృతజ్ఞతలు
- హర్షం వ్యక్తం చేసిన గౌడ సంఘాలు
గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరా కేఫ్ బీసీ సంక్షేమ శాఖలోని తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు బదిలీ అయింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఒప్పందపత్రాలు మార్చుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాలు గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాగా, రూ.20 కోట్ల బడ్జెట్ కేటాయించి నీరా కేఫ్ భవనంను నిర్మించి గౌడ కులస్తులకు ఆర్థిక చేయూత నివ్వడం కోసం ఏర్పాటు చేసిన దానిని ప్రభుత్వం టూరిజం శాఖ వారు వ్యాపార లావాదేవీలు చేసుకున్నారు తప్ప గౌడులకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని గౌడ సంఘాలు మండిపడ్డాయి.. దాంతో ఈ మధ్య కాలంలో టూరిజం శాఖ వారు నీరా కేఫ్ ను ఎత్తివేస్తూ టూరిజం హోటల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని గౌడ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో స్పందించిన బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇది ప్రవేటు వ్యక్తులకు చెందకూడదని గౌడకులస్తుల ఆత్మ గౌరవ ప్రతీక నీరా కేఫ్ ను గౌడకులానికే దక్కేలా చేస్తా అని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే టూరిజం శాఖ నుంచి గీత కార్పొరేషన్ సంస్థ కు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని సంప్రదించి గీత పారిశ్రామిక ఆర్థిక సహకార సంక్షేమ సంస్థ కు బదిలీ చేస్తూ రెండు శాఖల మధ్య అధికారుల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం.. అంతే కాదు గౌడ సమస్యలు ఏది ఉన్న పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనిపోయి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం కోసం సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ట్యాంకు బండ్ మీద పెట్టడానికి కృషి చేయాలని కోరగా.. అందుకు స్పందించిన మంత్రి సానుకూలంగా స్పందించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నీరాకేఫ్ ఇక నుంచి కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో నడవనుంది. త్వరలో బదిలీ ఉత్తర్వులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అధికారిక ఉత్తర్వులు వచ్చాక కేఫ్ నిర్వహణ, బడ్జెట్ ఇతర గైడ్ లైన్స్ రానున్నాయి. నెక్లెస్ రోడ్ లో ఉన్న నీరా కేఫ్ ను బీసీ సంక్షేమ శాఖలోని టాడీ టాపర్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ. 12.5 కోట్లతో నిర్మించగా టూరిజం డిపార్ట్ మెంట్ నిర్వహణలో ఉంది. కార్పొరేషన్ కు బదిలీ అయ్యాక గీత కార్మికులకు నీరా, తాటి బెల్లం విక్రయించేలా అవకాశం ఇస్తామని అధికారులు అంటున్నారు. కల్లు గీతా కార్మికులకు అండగా ఉంటానని, ఎలాంటి ఆందోళన వద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వల్ల వేలాది గౌడ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడం తో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తగిన ప్రోత్సాహం ప్రభుత్వం కల్పించి ప్రోత్సహిస్తుందని అన్నారు .
ఈ సందర్భంగా యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్ రాష్ట్ర గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని శాలువాతో సత్కరించి పూల బొకేతో గౌడ సంఘాల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి సాయన్న గౌడ్, గౌడ బిజినెస్ నెట్వర్క్ అధ్యక్షులు చీకటి ప్రభాకర్ గౌడ్, గౌడ సంఘం నాయకులు చెక్కిళ్ళ మధు సూదన్ గౌడ్, గుర్రం దేవేందర్ గౌడ్, ముద్దగోని రామ్మోహన్ గౌడ్ , మీరయ్యా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.