- శంకరన్ నాయర్ పట్టించుకోని ఆనాటి ప్రభుత్వం
- విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ
- సినిమా గురించి స్పందించిన అక్షయ్ కుమార్
దేశం కోసం పోరాడిన ఎందరినో కాంగ్రెస్ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కేరళకు చెందిన న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు చెట్టూర్ శంకరన్ నాయర్ను ఉద్దేశించి ఆయన స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ధైర్యవంతుడైన జాతీయవాది అయిన శంకరన్ నాయర్ను పక్కనపెట్టింది. హరియాణా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లోని ప్రతి బిడ్డ శంకరన్ నాయర్ గురించి తెలుసుకోవాలని మోదీ అన్నారు. హస్తం పార్టీ వారసత్వ రాజకీయాల్లోనే నిమగ్నమైపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ కొందరు గొప్ప వ్యక్తులను నిర్లక్ష్యం చేసిందని వారిలో శంకరన్ నాయర్ కూడా ఒకరని భాజపా నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా స్పందన వచ్చింది.
1919 జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత వైస్రాయ్ కార్యనిర్వాహక మండలికి నాయర్ రాజీనామా చేశారు. ఇదే అంశంపై ఇదివరకు సినీ నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. రాజకీయ నాయకులు ’కేసరి 2’ ని ఉద్దేశించి చేసే కామెంట్స్ గురించి తాను మాట్లాడాలనుకోవడం లేదన్నారు. నేను చరిత్రకారుడిని కాదు. నటుడిని మాత్రమే. ఈ సినిమాపై ఎవరెవరో చెప్పే మాటలు వినాలనుకోవడం లేదు. మేము గొప్ప సినిమాను ప్రజలకు అందించాలనుకుంటున్నాం. అలాగే ఈ చిత్రాన్ని పుస్తకం ఆధారంగా తెరకెక్కించాం. జలియన్ వాలాబాగ్పై ఎన్నో కథలు విన్నాం. అన్ని విషయాల గురించి తెలుసుకున్న తర్వాతే దీన్ని రూపొందించాం. మా తాతయ్య ఈ ఊచకోతకు ప్రత్యక్ష సాక్షి. ఆయన చిన్నప్పటినుంచి దీని గురించి నాకు ఎన్నో కథలు చెప్పారు. అందుకే ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. అందుకే ఈ సినిమాలో భాగం కావాలనుకున్నాను అని తెలిపారు. అక్షయ్ ఈ సినిమాలో శంకరన్ నాయర్ పాత్రలో నటించారు. జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాదిగా కనిపించనున్నారు.