- సైబర్ ఫ్రాడ్ నేరాలపై ప్రత్యేక దృష్టి
- పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్
- తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడి
వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా స్పందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ముందడుగు వేస్తోందని డీజీపీ జితేందర్ తెలిపారు. ముఖ్యంగా సైబర్ ఫ్రాడ్ నేరాలను అరికట్టేందుకు ఐజీ ర్యాంక్ అధికారిని ప్రత్యేకంగా నియమించామన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్ను ఏర్పాటు చేయడం, వారి ప్రయాణ సౌకర్యార్థం షీ షటిల్ బస్సులు అందుబాటులోకి తేవడం వంటి చర్యలను వివరించారు. తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో మెరుగైన పోలీస్ నిఘా , ప్రజా భద్రతపై రాష్ట్ర డీజీపీ జితేందర్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాంకేతిక పోలీసింగ్, సైబర్ భద్రత, మహిళా ఉద్యోగుల రక్షణ, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భద్రతా సహకారంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య భద్రత విషయంలో అంతరాన్ని తగ్గించడమే ఈ సమావేశ ఉద్దేశం అన్నారు. పరిశ్రమల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్లు జితేందర్ తెలిపారు. 100 డయల్ సేవలు మెరుగు పడటంతోపాటు పోలీస్ పనితీరు దేశంలోనే కాక, అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోందని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధి పోలీస్ భద్రతపై ఆధారపడి ఉంది. శాంతి భద్రతలను కాపాడడంలో మా బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తున్నాం, అని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ సమావేశం వాణిజ్య, పరిశ్రమల రంగం నుంచి విశేష స్పందన పొందింది. భద్రత , నిఘాపై ప్రభుత్వ నిర్ణయాలు పరిశ్రమల విశ్వాసాన్ని పెంచుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది.