- రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
తెలంగాణ అంతటా ఇవాళ, రేపు వర్షాలపై రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ ప్రకటించారు.
హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
ఎల్లో వార్నింగ్ ఉన్న జిల్లాలు
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ప్రకటించారు. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో 17న వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని నాగరత్న వివరించారు.