- బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపిన సూర్యుడు
- రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ
- శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
- జిల్లా కేంద్రంలో ఘనంగా బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
- పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ కే.నారాయణ రెడ్డి, అధికారులు
రాజ్యాంగ ప్రదాత, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆత్మబందువు భారతరత్న డాక్టర్ భీం రావు అంబేద్కర్ అని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134 జయంతి ఉత్సవాల్లో భాగంగా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి లతో కలసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.తదనంతరం ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. మహనీయులు ఇచ్చిన స్పూర్తి భవిష్యత్తు సమాజానికి సామాజిక బాధ్యత, సమాజ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.
రాజ్యాంగమే ఈ దేశానికి, ప్రజలకు రక్ష, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉందని స్పీకర్ తెలిపారు. రాజ్యాంగం కింద మనం ఎలా స్వేచ్ఛగా బతుకున్నామో రాజ్యాంగ పరిరక్షణకు ఎలా వ్యవహరించాలో భవిష్యత్తు తరాలకు తెలవాలని సూచించారు.అంబేద్కర్ అనేది ఒక పేరు కాదు, అది ఈ దేశ ప్రజల జీవన రేఖ. దళిత, బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలుగును ఇచ్చిన సూర్యుడు అన్నారు.ఈరోజు దేశంలో అట్టడుగు వర్గాలు విద్య, ఉద్యోగాలలో తమ వాటాను పొందుతూ, రాజకీయ రంగాలలో కీలకమైన పదవులలో ఉంటున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారే కల్పించిన రిజర్వేషన్లు మాత్రమేనని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేను ఈ రోజు రాష్ట్రంలో అత్యున్నత పదవి అయిన శాసనసభ సభాపతి అయ్యాను.
భారతదేశంలో ఉన్న భిన్నత్వం ప్రపంచంలో ఏ దేశంలో లేదు . భిన్న కులాలు, విభిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉండడం వల్ల మన రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని, ప్రపంచంలోని దాదాపు 60 ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను పరిశీలన చేసి అతి విలువైన మన రాజ్యాంగాని రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందించడం జరిగిందని తెలిపారు. అణగారిన వర్గాల ప్రజలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో సమాన అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధి పధంలో నడవడానికి డా. బీ. ఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ బద్దమైన రిజర్వేషన్లు ఒక కారణమని ఆయన తెలిపారు. జీవనది ఎల్లప్పుడూ ఎలా ప్రవహిస్తుందో అలాగే అంబెడ్కర్ విజ్ఞానం శతాబ్దాల పాటు ఈ దేశ యువతకు స్పూర్తిని ఇస్తుందని ఆయన తెలిపారు. పూరి గుడిసెలో, గిరిజన గూడేలల్లో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారంటే అంటే దానికి ఏకైక కారణం అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల పుణ్యమే అని ఆయన తెలిపారు.రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్య్రం, సంక్షేమ కార్యక్రమాల అమలు అందరికీ అందాలి అప్పుడే అంబేద్కర్ కన్న కలలు నెరవేరుతాయని స్పీకర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ… మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలన్నారు. జయంతి ఉత్సవాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె కాలే యాదయ్య, జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, ఎస్సిడి డబ్ల్యూఓ మల్లేశం, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, పెద్ది అంజి, బిసి కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్, దళిత సంఘాల నాయకులు,యువకులు,పాత్రికేయ మిత్రులు,ప్రజా సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.