- పదవ తరగతి విద్యార్థులకు చిట్టీలు అందించేందుకు వచ్చిన ఉపాధ్యాయులు
- విలేకరుల రాకతో నడక బాట పట్టిన ఉపాధ్యాయులు
- తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల సూర్యాపేట బాలుర – 1 ఉపాధ్యాయుల నిర్వాహకం
- పరీక్షలు రాసే విద్యార్థులకు చిట్టీలు ఎలా అందించాలో ఇంటర్మీడియట్ విద్యార్థికి ట్రైనింగ్
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న సంఘటనలు సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. గత నాలుగు రోజులుగా పదో తరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సెంటర్ ఏర్పాటు చేయగా, ఆ సెంటర్లో 136 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాస్తున్నారు. బుధవారం మ్యాథ్స్ ఎగ్జామ్ కావడంతో చివ్వెంల మండల పరిధిలోని దురాజ్ పల్లి లో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల సూర్యాపేట బాలుర – 1 విద్యార్థులకు తిరుమలగిరి సెంటర్ పడింది. ఆ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు నలుగురు, ఏకంగా బెలోనో కారు (టిఎస్ 29 జె 7557) లో పదో తరగతి గణితం బుక్కుతో సహా పేపర్ స్లిప్ లు కారు డిక్కీలో పెట్టీ ఆ చిట్టి లను ఉపాధ్యాయులు ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థినితో సెంటర్లోకి పంపిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కొందరు జర్నలిస్టులు సెంటర్ వద్దకు వెళ్లగా, సెంటర్ నుండి కొంత దూరంలో అనుమానాస్పదంగా కనిపించిన కారు దగ్గరికి వెళ్లి అందులో ఉన్న వారిని వివరాలు కోరగా, కార్లో ఉన్న నలుగురు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థి ఏం సమాధానం చెప్పకుండా కారు దిగి మౌనంగా వెళ్లిపోవడమే కాకుండా విలేకరులపై దురుసుగా ప్రవర్తించారు. కారు వెనక డిక్కీలో మాథ్స్ బుక్ తో పాటు చిట్టి లు కూడా లభ్యమయ్యాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించి జిల్లా లో పేరు నిలబెట్టేది పోయి, విద్యార్థులకు చిట్టీలు అందించే పనిలో పడ్డారు. తమ స్కూల్ విద్యార్థులను జిల్లాలో ఉత్తమ ర్యాంకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చేస్తున్న ఈ తప్పుడు పని పట్ల విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఇలా విద్యార్థులను చెడు మార్గంలో నడిచే విధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారి పేర్కొన్నారు. వీరు తీసుకొచ్చిన చిట్టీలు ఎగ్జామ్స్ సెంటర్లో ఉన్న విద్యార్థులకు చేరవేశారా.? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇన్చార్జి మండల విద్యాశాఖ అధికారిని రమణ : తిరుమలగిరి సెంటర్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు. సెంటర్ కు ఆఫ్ కిలోమీటర్ దూరంలో కారులో ఎవరో వచ్చి అక్కడ ఉన్నట్లు పోలీస్ ల ద్వారా నాకు మధ్యాహ్నం తెలిసింది. వారెవరు కూడా వెలుపలికి రావడం జరగలేదు. నేను ఉదయం 11:30 గంటల వరకు సెంటర్లోనే ఉన్నాను. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా సెంటర్ వద్ద గస్తి నిర్వహిస్తున్నారు.
చివ్వెంల ఎస్సై మహేశ్వర్ : పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఎవరో సెంటర్ కు 500 మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది. ఎవరు కూడా సెంటర్లోకి రావడం, సెంటర్ నుంచి బయటికి వెళ్లడం జరగలేదు. పోలీసు సిబ్బంది సెంటర్ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. సెంటర్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ పాల్పడేందుకు అవకాశం లేదు.