తెలంగాణ క్యాబినెట్ ఇవాళ (జూన్ 5న గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. రాజీవ్ యువవికాసం, ఉద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, భూభారతి, రెవెన్యూ సదస్సులు, రైతు భరోసా, వర్షాకాలం సన్నద్ధత తదితర అంశాలపైనా ఫోకస్ పెట్టనున్నారు. అలాగే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదిక కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే వీలుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూభారతిని ప్రారంభించిన ప్రభుత్వం అందులో ఎదురవుతున్న సమస్యలను, భూభారతి అమలుతీరును చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాయిదా పడిన రాజీవ్ యువవికాసం పథకంపై చర్చించి మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ నిర్ణయించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ధాన్యం కొనుగోళ్లు, వానా కాలం పంటల సాగు సన్నద్ధత వంటి అంశాలపై చర్చిస్తారు.