- మేం పాలకుల పక్షం కాదు.. పాత్రికేయుల పక్షమే
- రాష్ట్రవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలవాలి
- రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవపునయ్య
- రంగారెడ్డి జిల్లాలో భారీగా సభ్యత్వ నమోదు
- ఫెడరేషన్ లో చేరిన వివిధ యూనియన్ల నేతలు
రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. జర్నలిస్టులకు అండగా ఉండేందుకు ప్రత్యామ్నాయ ట్రేడ్ యూనియన్ గా ఏర్పడిన ఫెడరేషన్ జర్నలిస్టుల ఆదరణతో నెంబర్ వన్ యూనియన్ గా బలపడిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం, వివిధ యూనియన్ల నేతల చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయని, ఒకవైపు యాజమాన్యాలు, ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం లేదని, మరోవైపు దాడులు, అవమానాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు శిక్షణతో కూడిన వృత్తినైపుణ్యతను పెంపొందించుకొని విధినిర్వహణలో సమర్ధవంతంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రధాన జర్నలిస్టు యూనియన్లు జర్నలిస్టుల పక్షం కాకుండా పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని విమర్శించారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం పాలకుల పక్షాన కాకుండా కేవలం పాత్రికేయుల పక్షాన నిలిచి సమస్యలపై పోరాడుతుందని మామిడి సోమయ్య స్పష్టం చేశారు. ఈ సంఘంలో ఉన్న పాత్రికేయులు కూడా ప్రజల పక్షం ఉండాలని, ప్రజల సమస్యలపై స్పందించాలని కోరారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించాయని, గత బీఆర్ ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రాకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు తగ్గింపు, ఇండ్ల స్థలాలు వంటి సమస్యలు పరిష్కరించాల్సి వుందని అన్నారు. హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో ఫెడరేషన్ నిర్వహించబోయే ఉద్యమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు దేవేందర్, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి జగదీష్, జిల్లా కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ లో చేరిన 200 మంది జర్నలిస్టులు
రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీఎస్ యూడబ్ల్యూజే-ఐజేయూ అనుబంధం), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే-143) యూనియన్ లకు చెందిన దాదాపు రెండు వందల మంది జర్నలిస్టులు టీడబ్ల్యూజేఎఫ్ లో చేరారు. సూర్య దినపత్రిక జిల్లా బ్యూరో రిపోర్టర్ గణేష్, వార్త జిల్లా బ్యూరో రఘుపతి, సాక్షి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీశైలం, దిశ జిల్లా బ్యూరో సురేష్ తదితరులతో పాటు వివిధ పత్రికలకు చెందిన రెండు వందల మంది జర్నలిస్టులు ఆయా జర్నలిస్టు యూనియన్లకు రాజీనామా చేసి ఫెడరేషన్ లో చేరారు. వీరందరికి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య సభ్యత్వం ఇచ్చి సంఘంలోకి ఆహ్వానించారు.