అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మచ్చబోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం అయ్యారు. తమ కుమార్తెలు రెండు రోజుల నుంచి కనబడడం లేదని బాలికల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. బాలికల పేరెంట్స్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్లో పరిచయమైన ఇద్దరు యువకులు బాలికలిద్దరితో కలసి ఓయో రూమ్లో గడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరు ఈసీఐఎల్, మరొకరు దమ్మాయి గూడకు చెందిన వారిగా సమాచారం. కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 11న హైదరాబాద్కు చెందిన 17 ఏళ్ల బాలిక తనకు పరిచయమున్న 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కొద్ది రోజులకు పోలీసులు వెతికి పట్టుకున్నారు. భరోసా సెంటర్కు తరలించి విచారించడంతో బాలిక ప్రెగ్నెంట్ అని తేలింది. నిందితుడిపై పోక్సో (ప్రోటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ తరహా కేసులు గణనీయంగా పెరుగుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో ఆడపిల్లలు తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. వీరిలో చాలా మందిని పోలీసులే గుర్తిస్తున్నారు. మరికొందరు వారంతటవారే ఇంటికి వచ్చేస్తున్నారు. మరికొంతమంది అయితే తిరిగి రావడానికి భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ వార్తల్లో చూస్తున్నాం. యువతులు తమకు సన్నిహితంగా మెలిగే వారితో ఆకర్షణకు లోనవడం.. ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.