- ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ వద్దు
- మాజీ క్రికెటర్ శ్రీవాత్సవ్ గోస్వామి
- పాకిస్థాన్ చర్యలపై మండిపాటు
జమ్మూకశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఉగ్రవాద చర్యపై యావత్ క్రీడా లోకం విచారం వ్యక్తం చేసింది. పలువురు టీమ్ఇండియా క్రికెటర్లు బాధితులకు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ శ్రీవాత్సవ్ గోస్వామి పాకిస్థాన్ చర్యలపై మండిపడ్డాడు. ఇక పాకిస్థాన్తో భారత్ క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని అన్నాడు. భవిష్యత్లో పాక్తో టీమ్ఇండియా క్రికెట్ ఆడకూడదని బీసీసీఐకి లేఖ రాశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. వాళ్లతో క్రికెట్కు నో చెప్పండి. పాకిస్థాన్తో మనం క్రికెట్ ఆడవద్దు. ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ వద్దు. పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియాను అక్కడకి పంపనందుకు కొందరు ఏదో ఏదో మాట్లాడారు. రాజకీయాల కంటే క్రీడలే ఎక్కువ అని అన్నారు. మరి ఇప్పుడు జరిగిందేంటి? ఇండియన్స్ను చంపడమే వాళ్లకు జాతీయ క్రీడ అయ్యింది. వాళ్లు అలాగే ఆడితే మనం కూడా అదే భాషలో సమాధానం చెప్పాలి. అంతేకానీ బ్యాట్లు, బంతులతో కాదు. సంకల్పం, సహనంతో సమాధానం చెప్పాలి’‘నాకు చాలా కోపంగా ఉంది. ఎంతో బాధపడుతున్నాను. కొన్నినెలల కిందట లెజెండ్స్ లీగ్ ఆడేందుకు నేను కశ్మీర్ వెళ్లాను. పాహల్గామ్ను కూడా సందర్శించాను. స్థానికులతో మాట్లాడాను. వాళ్లలో మళ్లీ చిగురించిన ఆశను చూశాను. అక్కడ శాంతి తిరిగివచ్చిందనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ రక్తపాతం. ఇది మనసును కుదిపేస్తుంది. మనవాళ్లు చనిపోతుంటే ఎన్నిసార్లు మానంగా, క్రీడా భావనతో ఉండమంటారా? ఇక చాలు. ఈసారి అలా ఉండదు’ అని శ్రీవాత్సవ్ రాసుకొచ్చాడు.అయితే ఇరుదేశాల మధ్య భద్రతా కారణాల వల్ల భారత్ – పాక్ మధ్య 2013 నుంచి ద్వైపాక్షిక సిరీస్లు లేవు. ఈ దాయాది దేశాలు కేవలం ఐసీసీ టోర్నమెంట్ల్లోనే పోటీ పడుతున్నాయి. ఇక టీమ్ఇండియా చివరిసారిగా 2008లో పాకిస్థాన్లో పర్యటించింది.కాగా, కశ్మీర్ పహల్గామ్ ప్రాతంలోని బైసరన్లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 28మంది టూరిస్టులు మృతి చెందగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు తీవ్రంగా ఖండించారు.