పార్టీ అధినేత పిలుపు కోసం వెయిటింగ్
ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందేమోనని కవిత వెయిటింగ్ చేస్తున్నారు. ఆమె లెటర్ లీక్ అయి 10 రోజులు దాటినా కేసీఆర్ ఇంకా ఆమెను పిలిచి మాట్లాడలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగం చేసినందుకు కేటీఆర్ పరోక్షంగా కవితకు వార్నింగ్ ఇవ్వటం, తదనంతరం ఆమె సీరియస్ కావటం తెలిసిందే. దీంతో కేసీఆర్.. కవితపై కోపంగా ఉన్నారు.
కవిత ప్రోగ్సామ్స్కి బీఆర్ఎస్ శ్రేణులు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే తన కార్యక్రమాలను చేపడుతున్నారు. కేసీఆరే తన నేత అని కవిత అంటున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆమెతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కవిత లెటర్ అనంతరం బీఆర్ఎస్ క్యాడర్ డైలమాలో పడింది. గత నెల 26న లండన్కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు నుంచి అమెరికా వెళ్లారు.
మరో 4 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ నెల 10న హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉంది. కేసీఆర్ ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లనున్నారు. దీంతో కేటీఆర్ ఈ నెల 10న హైదరాబాద్కు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడే కవిత వ్యవహారం తెర మీదికి వచ్చింది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక కేటీఆర్.. కవిత కామెంట్స్పై స్పందిస్తారా లేదా అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోంది.