జూన్ 1.. గ్లోబల్ పేరెంట్స్ డే (ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం) సందర్భంగా..
మాతృదేవోభవ, పితృదేవోభవ అంటున్నది హిందూ సమాజం. అమ్మ లేనిదే జన్మ లేదు. నాన్న లేనిదే లోక జ్ఞానం కలగదు. అమ్మ బుడిబుడి అడుగులు వేయిస్తే, నాన్న చేయి పట్టి లోకాన్ని పరిచయం చేస్తాడు. అమ్మానాన్నలే ఆది దేవతలు. శిశువుకు తొలి గురువు అమ్మ అయితే రెండో గురువు నాన్న. పిల్లల్ని కనడానికి ముందు నుంచే అమ్మనాన్నలు సంతానవృద్ధి కోసం జీవితాలను అంకితం చేస్తారు. గర్భం దాల్చిన తల్లి.. బిడ్డను నవ మాసాలు కడుపులో మోసి, పోషించి, ప్రసవ వేదన అనుభవించి, కని, తను పునర్జన్మ పొంది మురిసిపోతుంది. శిశు దశ నుంచి పెరిగే ప్రతి క్షణం వరకు నాన్న పాత్ర, త్యాగం అనన్యసామాన్యం. అమ్మనాన్నలకు పిల్లలే ప్రపంచం. వారి అభివృద్ధే ఆనందం. వారి నవ్వులే లక్ష్యం. మనం కూడా తల్లితండ్రులయ్యే దాక మన అమ్మనాన్నలు మనకోసం పడ్డ కష్టాలు మనకు తెలియవు.
నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు, తల్లితండ్రులకు మధ్య ఏదో తెలియని తెరలు అడ్డుపడుతున్నాయి. పిల్లలతో గడపడానికి పేరెంట్స్కి సమయమే దొరకట్లేదు. తల్లిదండ్రుల ప్రాధాన్యాన్ని గ్రహించి, వారితో జీవితకాలం చేతిలో చెయ్యి వేసి నడవటం, పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధాలు బలపడటం, జీవిత చరమాంకంలో తల్లితండ్రులకు ఆసరాగా నిలవటం అనే లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఐక్య రాజ్య సమితి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏటా జూన్ 1న గ్లోబల్ పేరెంట్స్ డే (ప్రపంచ తల్లితండ్రుల దినోత్సవం) జరుపుకుంటున్నారు. తల్లిదండ్రులు పంచే ప్రేమ, పెంపకంలో వారు చూపే శ్రద్ధ, పిల్లల ఎదుగుదల కోసం వారు పడే తపనలను మాటల్లో వర్ణించలేం. పిల్లలు ఎదిగిన తర్వాత తమ తల్లితండ్రులను అక్కున చేర్చుకొని, ఊత కర్రగా మారి, వారి ఆయురారోగ్యాలకు మనస్ఫూర్తిగా దోహదడాలి, అమ్మానాన్నల రుణం కొంతైనా తీర్చే ప్రయత్నాలు చేయాలి.
పేగు బంధం.. పరమ పవిత్రం..
తల్లి పేగు బంధం పరమ పవిత్రం. తండ్రి త్యాగాలు పిల్లల ఎదుగుదలకు మూల స్థంభాలు. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం రోజున తమ జన్మ ప్రదాతలను తగిన రీతిలో దైవ సమానంగా సన్మానించుకోవాలి. కుటుంబ పెద్దలు తల్లిదండ్రులు.. పిల్లలకు రక్షణ గొడుగులు. కుటుంబానికి ఇల్లు తండ్రి అయితే ఆ ఇంటి దర్వాజకు తోరణం, గడపకు పసుపు పారాణి అమ్మ. 2025 ప్రపంచ తల్లితండ్రుల దినోత్సవానికి ఇతివృత్తంగా “తల్లిదండ్రులను పెంచడం” అనే అంశాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా.. ఎదిగిన పిల్లలకు తల్లితండ్రులను చూసుకునే బాధ్యతలను వివరిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు భావోద్వేగ మద్దతు, పోషణ అందించడం, ఉజ్వల భవితకు బాటలు వేయడం, లోక జ్ఞానాన్ని అందించడం, సంస్కారాలను నూరిపోయడం, క్రమశిక్షణాధికారుగా నిలవడం తదితర ప్రధాన అంశాలపై దృష్టిపెడతారు.
పిల్లల శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక అభివృద్ధికి అమ్మానాన్నలు మద్దతిస్తారు. పిల్లల కనీస అవసరాలను తీర్చడం, విద్యాబుద్దులు నేర్పించడం, సంరక్షణ బాధ్యతలు తీసుకోవడం, నైతిక శిక్షణను ఇవ్వడం, ప్రోత్సాహ స్ఫూర్తిని అందించడం, వివిధ సమయాల్లో అవసరమైన సహాయం చేయడం, ప్రేమ, ఆప్యాయతలను పంచడం, మానవ సంబంధాలను ఏర్పరచడం లాంటి గురుతర బాధ్యతలను తల్లిదండ్రులు స్వచ్ఛందంగా, జీవిత ఏకైక లక్ష్యంగా తీసుకుంటారు. అలాంటి అమ్మానాన్నలను ఎదిగిన పిల్లలు చక్కగా చూసుకోవడం, వారి త్యాగాలకు తిరిగి రుణం తీర్చుకోవడం కనీస బాధ్యత అని తెలుసుకొని మసలుకోవాలి.
- డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037