ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రధాని మోదీ
పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ మొదటిసారి జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నెల 6న జమ్మూకాశ్మీర్కి రానున్న ఆయన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ని ఓపెన్ చేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. చీనాబ్ నదిపై నిర్మించారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ని ప్రారంభించే విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. మరో మూడు రోజుల్లో సరికొత్త చరిత్రకు నాంది పలకబోతున్నామని చెప్పారు. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ మార్గంలోని చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జ్ని ప్రకృతి విపత్తులను తట్టుకునే రీతిలో దృఢంగా నిర్మించారు. నవ భారతాని శక్తికి, దూరదృష్టికి ఈ బ్రిడ్జ్ గురుతుగా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు. చీనాబ్ నదిపై దాదాపు 358 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జ్.. పారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎత్తులో ఉండటం విశేషం.