జూన్ 2న ఉదయం 10 గంటలకు విడుదల
జేఈఈ అడ్వాన్స్డ్-2025 రిజల్ట్స్ సోమవారం (జూన్ 2న) రానున్నాయి. ఉదయం పది గంటలకు ‘ఫైనల్ కీ’తోపాటు ఫలితాలను విడుదల చేయనున్నారు. అఫిషియల్ వెబ్సైట్ https://jeeadv.ac.in/లో చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలను ఐఐటీ కాన్పూర్ రిలీజ్ చేయనుంది. మే 18న 2 పూటలు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 1.80 లక్షల మంది హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది ఈ టెస్ట్ రాశారు. 2024 జేఈఈ అడ్వాన్స్డ్లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కులను బట్టి టోటల్గా 48,248 మందికి జోసా కౌన్సెలింగ్కి అవకాశం కల్పించారు. వాళ్లు మాత్రమే ఐఐటీల్లో సీట్లకు అర్హులు.
పోయినేడాది(2024-25లో) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్ను మే 22న, ప్రొవిజినల్ ఆన్సర్ కీని 26న రిలీజ్ చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైన వారికి బీఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఏఏటీ 2025) పెడతారు. ఈ పరీక్ష జూన్ 5న జరగనుంది. జూన్ 3న సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు. ఈసారి 6 విడతల్లో కౌన్సెలింగ్ ఏర్పాటుచేశారు. సీట్ల కేటాయింపు.. తొలి విడత జూన్ 14, రెండో విడత జూన్ 21, మూడో విడత జూన్ 28, నాలుగో విడత జూలై 4, ఐదో విడత జూలై 10, ఆరో విడత జూలై 16.