పార్టీ వర్క్షాప్లో క్లారిటీ వచ్చే ఛాన్స్!
తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? పార్టీ అధిష్టానం రేపోమాపో ఈ మేరకు ప్రకటన చేయనుందా? ఈ రోజు హైదరాబాద్లో జరగనున్న బీజేపీ వర్క్షాప్లో దీనిపై ఒక స్పష్టత రానుందా? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుణ్ని నియమించటం కాషాయం పార్టీకి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం (జూన్ 1న) హైదరాబాద్లో జరగబోయే బీజేపీ వర్క్షాప్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ కీలక కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్కి అధిష్టానం దూతలు అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ హాజరవుతారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు రాష్ట్ర స్థాయి పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు.
ఈ సమావేశంలో తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని సమాచారం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లడం, ఇంటర్నేషనల్ యోగా డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవ నిర్వహణపై ప్రధానంగా చర్చిస్తారు. భవిష్యత్తులో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై దృష్టిపెడతారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేస్తారు. పార్టీ వేదికల్లో నాయకులు మాట్లాడాల్సిన తీరుపై సూచనలు, సలహాలు ఇస్తారు.
రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం పైనా రూట్ మ్యాప్ ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ భేటీకి లీడర్లు అందరూ కంపల్సరీగా రావాలని బీజేపీ తెలంగాణ నాయకత్వం ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. మరో వైపు.. తెలంగాణ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ ఎంపిక వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ సీటుపై కన్నేసిన నాయకులు హైకమాండ్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన హైకమాండ్ రాష్ట్ర అధ్యక్షులను నియమించదని చెప్పారు. ఈ మేరకు స్పష్టమైన విధానం ఉందని తెలిపారు.