పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న 5 రాష్ట్రాల్లో ఇండియా ఇవాళ (2025 మే 31న) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘ఆపరేషన్ షీల్డ్’ను నిర్వహించనున్నారు. ఆపరేషన్ షీల్డ్ అనేది ఒక మాక్డ్రిల్. పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్లలో ఈ ఎక్సర్సైజ్ చేపడతారు. 4 గంటల పాటు కొనసాగే ఈ ప్రక్రియలో 5 రాష్ట్రాల పరిధిలోని అన్ని (244) జిల్లాలు పాలుపంచుకోనున్నాయి. ఈ మేరకు రంగం సిద్ధం చేశారు. తద్వారా లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ: సరిహద్దు నియంత్రణ రేఖ) వెంట ఉన్న రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేస్తారు.

యుద్ధానికి వాళ్లు ఏ మేరకు రెడీగా ఉన్నారో తెలుసుకొని దాన్ని వేరే లెవల్కి మెరుగుపరుస్తారు. దీనికోసం చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాల్లోని సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లు అన్ని జిల్లాల కలెక్టర్లకు, మేజిస్ట్రేట్లకు గైడ్లైన్స్ ఇచ్చాయి. బ్లాకౌట్, మాక్ డ్రిల్స్ని విజయవంతం చేయాలని కోరాయి. మాక్ డ్రిల్ సమయంలో వాయుసేన, సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్స్ మధ్య హాట్లైన్లు క్రియాశీలకమవుతాయి. ఎయిర్ రైడ్ సైరన్లను, అత్యవసర సమాచార వ్యవస్థలను టెస్ట్ చేస్తారు. ప్రజలు నివసించే ఏరియాల్లో కరెంట్ బంద్ చేస్తారు. హాస్పిటల్స్, అంబులెన్స్ తదితర ఎమర్జెన్సీ సర్వీసులను దీన్నుంచి మినహాయిస్తారు.