ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పార్లమెంట్లోని పెద్దల సభకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, ఎంఎన్ఎం ప్రకటించాయి. గత లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఒడంబడిక ప్రకారం ఎంఎన్ఎం పార్టీకి తాజాగా రాజ్యసభ స్థానం కేటాయించారు.

తమిళనాడు, అస్సాంలలోని 8 ఎంపీ సీట్లకు వచ్చే నెల 19న ఎలక్షన్ జరగనుంది. ఇందులో 6 స్థానాలు తమిళనాడులో, 2 స్థానాలు అస్సాంలో ఉన్నాయి. తమిళనాడు శాసనసభలో డీఎంకే పార్టీకి 134 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి ఈ పార్టీ 4 రాజ్యసభ సీట్లలో విజయం సాధించటం ఖాయం. ఈ నాలుగు స్థానాల్లో ఒక చోట కమల్ హాసన్ను గెలిపించుకోనుంది. ఆయన 2018లో ప్రారంభించిన ఎంఎన్ఎం పార్టీ కేంద్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామి. డీఎంకే కూడా ఆ అలయెన్స్లో కొనసాగుతోంది.

ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ 2024 సాధారణ ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాల్లో, పుదుచ్చెరిలోని ఒక చోట డీఎంకే కూటమి తరఫున ప్రచారం చేసింది. అందుకు ప్రతిఫలంగా ఒక రాజ్యసభ సీటును పొందుతోంది. ఈ మేరకు ఇరు పక్షాల మధ్య ముందే ఒప్పందం కుదిరింది.