ఇండియాకి వస్తున్న ప్రభాకర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రధాన నిందితుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి వస్తున్నారు. జూన్ 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి తెలిపారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కూడా ఆయన సుప్రీంకోర్టుకు లేఖ రాసిచ్చినట్లు తెలుస్తోంది. వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ వచ్చిన తక్షణమే ప్రభాకర్ రావు స్వదేశానికి బయల్దేరినట్లు సమాచారం. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఆయన అమెరికా నుంచి వస్తున్నారు. పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లో ఇండియాకి రావాలని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును ఆదేశించిన విషయం విదితమే. గడచిన 14 నెలలుగా ప్రభాకర్ రావు యూఎస్లోనే ఉంటున్నారు. ప్రభాకర్ రావు కీలక నిందితుడు కాబట్టి అతణ్ని విచారిస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశముందని దర్యాప్తు బృందం భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల, స్వపక్షంలోని అసంతృప్త నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)తో విచారణకు ఆదేశించింది. దీన్ని ముందుగానే పసిగట్టిన ప్రభాకర్ రావు అమెరికా వెళ్లినట్లు తెలుసుకుంది. ఈ కేసుతో ప్రమేయమున్న అందర్నీ ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది.