పుత్తడి ధర మరోసారి లక్షకు చేరువైంది. రిటైలర్లు, ఆభరణాల కొనుగోలుదారులు పసిడి వైపు మొగ్గుచూపడంతో జాతీయ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర మళ్లీ 99 వేల రూపాయల పైకి చేరుకుంది. వారం కిందటితో పోలిస్తే బంగారం రేటు రూ.550 పెరిగి 99,300 రూపాయలు పలికింది. గత వారం రోజుల్లో గోల్డ్ ధర 3 వేల రూపాయలకు పైగా పెరిగినట్లు అయింది. అలాగే 99.5 శాతం ప్యూరిటీ కలిగిన పసిడి ధర 500 రూపాయలు అధికమై 98,800 రూపాయలకి చేరింది. స్వర్ణంతోపాటు వెండి రేట్లు కూడా పరుగులు తీస్తున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు పెంచారు. దీంతో కిలో వెండి ఒక్కసారే 1,170 రూపాయలు ఎగబాకింది. తద్వారా 1,00,370 రూపాయలకు వెళ్లింది. గతంలో ఇది 99,200 రూపాయలుగా మాత్రమే ఉంది. యూరోపియన్ యూనియన్ దేశాలపై విధించిన 50 శాతం టారిఫ్ల అమలును అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేటు దిగొచ్చింది. అయినా దేశీయంగా పెరిగిందని పరిశీలకులు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ఔన్స్ గోల్డ్ రేటు 24.83 డాలర్లు తగ్గి 3,332.59 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.