మరికొద్ది రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. వేసవి సెలవులు ముగియనుండటంతో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో బడి బాట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం.. ఉపాధ్యాయులను ఆదేశించింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కారు బడుల్లోనే చేర్పించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే.. గవర్నమెంట్ స్కూల్స్లో సరైన వసతులు ఉండవని పేరెంట్స్ భావిస్తుంటారు. అందుకే విద్యార్థులను ప్రైవేట్ బడులకు పంపిస్తుంటారు.
ఈ పరిస్థితికి అద్దంపట్టేలా ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రదర్శించిన ఈ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. చిలకలగూడ ప్రాంతంలోని దూద్బావిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచర్ చూపిస్తున్న ఈ పోస్టర్.. క్షేత్ర స్థాయిలోని వాస్తవాలను కళ్లకు కడుతోంది. బడిబాట సరే.. మా బడికి దారేది సార్ అంటూ ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ప్రశ్నించారు. ప్లీజ్ సార్ మా బడికి బాట వేయించండి అని కూడా ఈ టీచర్ సీఎంని రిక్వెస్ట్ చేశారు. గౌరవనీయ సీఎం గారూ అంటూ చేతులెత్తి దండం పెట్టారు. తమ విద్యార్థుల సౌకర్యార్థం ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పడుతున్న తపన అభినందనీయం.

నిజం చెప్పాలంటే చాలా చోట్ల సర్కార్ బడుల్లో సరైన సౌకర్యాలు ఉండవు. ఎక్కువ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఊరికి దూరంగానే ఉంటాయి. కాబట్టి వాటికి చేరుకోవటానికి దారులు ఉండవు. డొంకల్లో ముళ్లు పొదలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వానా కాలంలో ఆ ఇరుకు సందులు బురదమయం అవుతాయి. గుంతల్లో నీళ్లు నిలుస్తుంటాయి. మరికొన్ని ప్రదేశాల్లో వాగులు వంకల మీదుగా పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. బురదతో నిండిన దారుల్లో కాళ్లకు చెప్పులేసుకొని నడిస్తే విద్యార్థుల బట్టల మీద, స్కూల్ బ్యాగుల మీద బురదపడుతుంది. దీంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొన్ని ఏరియాల్లో పిల్లలు సైకిళ్ల మీద కూడా బడికి వెళ్లలేనివిధంగా రోడ్లు తయారయ్యాయి. డొంకల్లో రెండు వైపులా చెట్లు, చేమలు ఉండటం వల్ల వాటి నుంచి పాములు, తేళ్లు తదితర విషపురుగులు వచ్చే ప్రమాదం ఉంది. విద్యార్థులు వాటి బారినపడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ప్రధానంగా టాయిలెట్స్ సమస్య నెలకొంటుంది. మూత్ర విసర్జన కోసం విద్యార్థులు తుప్పల చాటుకి, చెట్ల వెనక్కి వెళ్లి ప్రమాదాల బారినపడ్డట్లు వార్తా పత్రికల్లో, టీవీ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి సర్కారు బడులకు సరైన వసతులు కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు.