భూకంపానికి కారాగారం గోడ కూలటంతో జంప్
పాకిస్థాన్లో దాదాపు 216 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన మాలిర్ జిల్లా జైలులో సోమవారం రాత్రి జరిగింది. భూకంపం వల్ల కారాగారం గోడ కూలి అందులోని ఖైదీలు జంప్ అయ్యారని ఆఫీసర్లు చెప్పారు. ఆదివారం నుంచి భూమి ప్రకంపించడంతో ఆందోళనకు గురైన ఖైదీలు బయటపడిన సమయంలో జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా తుపాకీ శబ్ధాలు వినిపించాయి. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరారైన ఖైదీలను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్ట్టామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 86 మందిని అదుపులోకి తీసుకున్నారు. జైలు ప్రాంతాన్ని సీజ్ చేశారు. గుర్తింపు కార్డులు ఉన్నవాళ్లనే లోపలికి అనుమతిస్తున్నారు. భూ ప్రకంపనలు ఎక్కువవటంత జైల్లోని 4, 5 నంబర్ గదుల్లోని ఖైదీలను సేఫ్ ఏరియాకి తరలిస్తుండగా పలు బ్యారక్లలో ఉన్న 600 మంది ఖైదీలు బయటకు వచ్చారు. అందులో 216 మంది పరార్ అయ్యారు. ఇంకా 135 మంది ఖైదీల ఆచూకీ గుర్తించాల్సి ఉంది. ఈ జైలులో ఎక్కువ శాతం మంది మత్తు పదార్థాలకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్ అయినవారే.