జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇవాళ (2025 మే 31న) దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తోంది. ఎన్ఐఏకి చెందిన పలు టీమ్లు ఈ తనిఖీల్లో పాలుపంచుకుంటున్నాయి. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాంలలో సెర్చింగ్ చేస్తున్నాయి. దేశ ద్రోహ నేరానికి పాల్పడిన పలువురిని ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మోతీరామ్ జాట్ని, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని, ఏపీలో సిరాజ్, సమీర్లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతోంది.

మోతీరామ్ జాట్ పాకిస్థాన్కి స్పై(గూఢచారి)గా వ్యవహరించాడు. మన దేశానికి చెందిన కీలక సమాచారాన్ని డబ్బులు తీసుకొని పాకిస్థాన్కి అప్పగించినట్లు తేలింది. జ్యోతి మల్హాత్రా సైతం ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులోనే ఉంది. సిరాజ్, సమీర్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారు. వీరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. వాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా తాజా సోదాలకు ఉపక్రమించారా అనేది చర్చనీయాంశంగా మారింది.