- మాజీ మంత్రి హరీశ్రావు
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు నాటి నుంచి నేటి వరకు అన్యాయమే జరిగిందని, ఇప్పుడు జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీష్రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారని చెప్పారు. 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవని తెలిపారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్చావును సీఎం రేవంత్ రెడ్డి కోరుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీష్రావు చిట్చాట్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు.. అందుకే అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి స్పీచ్ను బహిష్కరించామని హరీష్రావు అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి..299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారని హరీష్రావు గుర్తుచేశారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్దేనని విమర్శించారు. ఢిల్లీకి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లారని.. నీటి కేటాయింపులపై చర్చించారని చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా ఎందుకు ఒప్పుకుని వచ్చారని హరీష్రావు ప్రశ్నించారు. పొతిరెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నారని ఆరోపణలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క రోజు కూడా వ్యతిరేకించలేదని.. 40 రోజులు అసెంబ్లీని స్థంభింపజేశామని గుర్తుచేశారు. తెలంగాణ కోసం తాము ఆ రోజు ఆరు మంత్రి పదవులు వదులుకున్నామని చెప్పారు. మంత్రి ఉత్తమ్ ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చారు.. కృష్ణ నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారని హరీష్రావు మండిపడ్డారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీశైలం ఖాళీ చేసే లాగా ద్రోహం చేశారని హరీష్రావు విమర్శించారు. సెక్షన్ 3ను సాధించింది కేసీఆర్ అని గుర్తుచేశారు. 573 టీఎంసీల నీళ్లు సెక్షన్ 3 ద్వారా తెచ్చింది తామేనని చెప్పారు. ద్రోహ చరిత్ర ఉత్తమ్ది.. త్యాగ చరిత్ర బీఆర్ఎస్ది అని ఉద్గాటించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది బీఆర్ఎస్ అని తెలిపారు. నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ కారణం.. కృష్ణ నీళ్లను సముద్రంలో కలిపారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వగలిగామని గుర్తుచేశారు. హుజూర్ నగర్ను ముంపునకు గురి చేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారని ఆరోపించారు. పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడుకున్నామని హరీష్రావు పేర్కొన్నారు.