సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయిస్తే అడ్డుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించే వేలంలో ఎవరూ పాల్గొనవద్దని, ఆ భూములను కొనుగోలు చేస్తే అందులో అడుగుపెట్టనీయబోమన్నారు. భూముల విక్రయంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. భూముల విక్రయాలను ఆపకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాచిగూడలోని ఓ హోటల్లో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్, ఓయూ జేఏసీ చైర్మన్ రాజు, బీసీ సంఘాల నేతలు కోల జనార్దన్, నందగోపాల్, ఉదయ్, చెరుకు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.