మూడు రోజులు కురిసే అవకాశం
వాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 29 వరకు కుండపోత వాన పడుతుందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, అవి విస్తరించేందుకు పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ (సోమవారం) వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయి. రేపు (మంగళవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎల్లుండి (బుధవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది. కరీంనగర్ పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతాయి. ఆయా జిల్లాలకు కూడా ఆరెంజ్ అలెర్ట్ని జారీ చేశారు.