– పిల్లల్ని సర్కారు పాఠశాలల్లోనే చేర్పిద్దాం
– గవర్నమెంట్ స్కూల్స్లోనే సమగ్ర వికాసం
– టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి
– ప్రారంభమైన బడిబాట ప్రచార జాతా
సర్కారు పాఠశాలలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే జాయిన్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందాలని కోరారు. గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా తలపెట్టిన ‘బడి బాట ప్రచార జాతా’ సోమవారం (మే 26న) పలు జిల్లాల్లో ఆరంభమైంది. ఖమ్మం జిల్లా కమిటీ చేపట్టిన కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలోని వైరా రోడ్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడారు.
ఆయన ప్రసంగంలోని అంశాలు..
సర్కారు పాఠశాలల్లోనే ట్రైన్డ్ టీచర్లు, పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు, ప్లే గ్రౌండ్ ఉంటాయి. అందువల్ల తల్లిదండ్రులు వాటి వైపు మొగ్గుచూపాలి. తద్వారా నాణ్యమైన విద్యను ఫ్రీగా పొందొచ్చు. గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్కి టెక్ట్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫామ్ ఉచితంగా ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా మంచిగా మధ్యాహ్న భోజనం, వారానికి 3 సార్లు ఎగ్స్, రాగిజావ తదితర పౌష్టికాహారం అందిస్తారు. పిల్లల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడతాయి.
ఆలయం, మసీదు, చర్చిల నిర్మాణం కోసం ఒక్కటిగా కదిలే ప్రజలు ఊరి బడి కోసం కూడా ఏకం కావాలి. ప్రతి ఇంటికీ వెళ్లి ఆ ఇంట్లోని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించాలి. టీఎస్ యూటీఎఫ్ శ్రేణులు 10 రోజుల పాటు ఈ ప్రచారం నిర్వహిస్తారు. సర్కారు పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ మీడియం ఉందని, పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని, పెద్ద చదువులు చదివిన టీచర్లు ఉంటారని పేరెంట్స్కి వివరిస్తాం.
ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లల తల్లిదండ్రుల ఆకాంక్షలను వ్యాపారంలా చూస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే మంచి విద్య అందిస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ వల్ల పేరెంట్స్ తమ సంపాదనలో సగానికి పైగా తమ పిల్లల చదువుల కోసమే ఖర్చుచేయాల్సి వస్తోంది. అందువల్ల ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలి. అవి మూతపడితే సొసైటీకే నష్టం. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.
ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మన ఊరు–మన బడి’, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన మెరుగైంది. ప్రైమరీ స్కూల్స్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ క్లాసులను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏఐ బేస్డ్ టీచింగ్, డిజిటల్ క్లాస్ రూమ్లు, లైబ్రరీ, ల్యాబ్లతోపాటు గేమ్స్, స్పోర్ట్స్ తదితరాలతో అద్భుతమైన వాతావరణం, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, స్కిల్స్ కలిగిన టీచర్లతో ఒత్తిడి లేని చదువు ప్రభుత్వ పాఠశాలల్లోనే అందిస్తున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యం, పర్సనాలిటీ డెవలప్మెంట్కి అనువుగా గవర్నమెంట్ స్కూల్స్ తయారవుతున్నాయి. విద్యా వసతుల కల్పనకు సర్కారుపై ఒత్తిడి తెస్తే బడి తప్పనిసరిగా బాగుపడుంది.
తొలి రోజు బడి బాట ప్రచార జాతాను ఖమ్మంలోని వైరా రోడ్డు, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లందు క్రాస్ రోడ్డు ఏరియాల్లో నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంజాన్, జనరల్ సెక్రెటరీ పారుపల్లి నాగేశ్వరరావు, నేతలు జీవీ నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, బాణోత్ రాందాస్, లివిన్ స్టన్, ధర్మసోత్ నాగేశ్వరరావు, పినపాక సురేష్, కట్టా పద్మ, వి.దామోదర్, ఉద్దండ్, మంగీలాల్, నెల్లూరి వీరబాబు, ఏడునూతల.రవికుమార్, జి.భిక్షపతి, యు.నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్, శివకోటి తదితరులు పాల్గొన్నారు.