77 ఏళ్ల అగ్రవర్ణ ప్రభుత్వాల పాలనలో బడుగు, బలహీనవర్గాలకు ఒరిగింది శూన్యమని ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ విమర్శించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాలు తమ తమ ఆస్తులను పెంచుకుయాని ఆరోపించారు. అధికారం, సంపద అనుభవించి మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఈ మేరకు వేణుకుమార్ ప్రకటన విడుదల చేశారు.

అందులోని అంశాలు..
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బీసీ నాయకత్వం అజ్ఞానంలోనే ఉండిపోయింది. ఇంకా అగ్రకులాల పార్టీల్లోనే ఉంటూ వాటికి అండగా నిలుస్తున్నారు. BC ఇంటలెక్చువల్స్ ఫోరం బీసీ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తోంది. అయితే.. కేంద్రంతోపాటు రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రకుల నాయకత్వం ఒక్కటై బీసీలను డైలమాల్లో ఉండేట్లు ప్రకటనలు చేపిస్తున్నాయి.
అతని కన్నా ఘనుడు ఆచంట మల్లన్న అనే రీతిలో గత ప్రభుత్వానికి ఏమీ తీసిపోకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్నాయి. గత 11 ఏళ్లలో విద్యార్థుల డ్రాపౌట్స్ పెరిగాయి. ఎంతో మంది యువత మద్యానికి బానిసై మధ్యలోనే స్మశానానికి వెళ్లిపోతున్నారు. బడుగు, బలహీనవర్గాల జీవితాలు మద్యం మత్తులోనే ఉండేట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి.
మద్యం ద్వారా ఏటా 30 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అయినా మద్యం రేట్లను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నారు. తద్వారా ప్రభుత్వం ప్రతి నెలా రూ.500 కోట్ల అదనపు రాబడి పొందుతోంది. ప్రభుత్వాలకు కేవలం ఆదాయాన్ని సృష్టించే సులువైన మార్గంగానే “మద్యం పాలసీ” ఉంటోంది. గత 77 ఏళ్లలో బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాలేదు.
విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో ఆశించిన ఫలితాలు రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ 77 ఏళ్లలో మీడియా, హోటల్స్, కాలేజీలు, రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, హాస్పిటల్స్, సినిమా థియేటర్లు, రాజకీయ నేతల, అగ్రకులాల వారి గుప్పెట్లోనే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో 40 ఏళ్లు BCలకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలున్నా రిజర్వేషన్లు లేక దాదాపు రెండు తరాల బీసీ మేధో శక్తిని కోల్పోయాం.
పేర్లు వేరైనా పార్టీలు ఒక్కటే. అధ్యక్షులు వేరైనా అగ్రకులాల వారే. వాళ్ల విధానాలు ఒక్కటే. అందువల్ల ఇప్పటికైనా మన ఓట్లు మనకే వేసుకుందాం. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం ఉన్నత విధానాలను రూపొందించుకుందాం. ఇది జరగాలంటే BCల రాజ్యాన్ని సాధించుకుందాం.