ఇండియాలో కరోనా మహమ్మారి మరోసారి ప్రతాపం చూపుతోంది. పాజిటివ్, యాక్టివ్ కేసులు రోజురోజుకీపెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కొవిడ్ క్రియాశీలక కేసులు 3 వేలకు చేరువలో ఉన్నాయి. కరెక్టుగా చెప్పాలంటే 2,710 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా మూడు రాష్ట్రాల్లో (కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర) వెలుగు చూసినట్లు పేర్కొంది. కేరళలో 1147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 కేసులు ఉన్నట్లు వివరించింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏడుగురు చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా 1010 కరోనా కేసులు నమోదు కాగా తర్వాత నాలుగు రోజుల్లోనే 2,710 కేసులు వచ్చాయి. కొవిడ్ వల్ల మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, కర్టాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అయితే.. వీరిలో ఎక్కువ మంది వయసు మీద పడ్డ వారే కావటం గమనార్హం. ప్రస్తుతం వ్యాపిస్తున్నది జేఎన్ వన్ వేరియంట్ అని అంటున్నారు.
ఇది ఎటాక్ చేస్తే జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకలి అనిపించకపోవడం, వికారం, అలసట, జీర్ణాశయ సమస్యలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో లాక్డౌన్ అంశం మళ్లీ తెర మీదికి వస్తోంది.