- ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న వైనం
- యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరిద్దరిదే రాజ్యం..
- బడా బాబులకు దోచిపెడుతున్న ప్రజా ప్రతినిధులు..
- కొండలు, గుట్టలు, నీటి కుంటలు కనుమరుగవుతున్న దౌర్భాగ్యం..
- తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా సాగుతున్న భూ దోపిడీ..
- స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసిన, చర్యలు శూన్యం.. పైగా బెదిరింపులు
- జయంరాంరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి లకు అండదండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు
- అక్రమ వెంచర్లకు సపోర్టు ఇస్తున్న జిల్లా అధికార యంత్రాంగం
ప్రజలు ఓట్లేసి గెలిపించేది.. తమకు సేవ చేస్తారని.. కానీ ఇప్పటి నాయకులు ఏమి చేస్తున్నారు..? సేవ కాదు కదా షేవ్ చేస్తున్నారు.. ప్రజల హక్కులను, ప్రభుత్వ భూములను, ఆస్థులను కాపాడాల్సిన వారే వాటిని భక్షిస్తున్నారు.. అధికారం సంక్షేమం కోసం వినియోగించాలి గానీ.. స్వలాభం కోసం అధికారం వినియోగించుకోవడం.. అక్రమార్జనకు అర్రులు చాచడం.. ఇదే జరుగుతోంది ప్రస్తుతం.. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా అడ్డగోలుగా మింగేస్తున్నారు.. ఇలాంటి సంఘటనే యాదాద్రి జిల్లాలో వెలుగుచూసింది.. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఒక్కటేమిటీ దేన్నీ వదలకుండా కబ్జా చేసేస్తున్నారు.. ప్రస్తుత శాసనసభ్యుడు ఒకరు ఈ వ్యవహారమంతా నడిపించాడని ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు..

యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరు ఎంత చెబితే అంత.. ప్రభుత్వ అధికారులను లంచాలతో కొనేశారు.. ప్రజా ప్రతినిధులను చాకచక్యంగా మచ్చిక చేసుకుంటారు.. వారి కార్యక్రమాలకు వీరే స్పాన్సర్ చేస్తారు.. స్థానిక నాయకులకు ఏమి కావాలన్నా క్షణాల్లో అమర్చుతారు.. ఏ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నా పెద్ద సమస్య కాదు.. ఒక సినిమాలో చెప్పినట్లు అచ్చిక బుచ్చిక చేసి మచ్చిక చేసుకుని అంగుళీయకం సంపాదిస్తాను అన్న చందాన అధికార పార్టీ నాయకులను ఎదో రకంగా మచ్చిక చేసుకుని బుట్టలో వేసుకుంటారు.. తాము ఖర్చుపెట్టిన దానికి ఎన్నో రెట్లు అక్రమంగా వెనుకేసుకుంటారు.. ఇక అధికారులను తమకు అనుగుణంగా మార్చుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.. వారే జయరాం రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి.. సాల్వో ఇండస్ట్రీస్, ఆర్ఆర్ఎనర్జీస్ హైట్స్ అనే ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలకు యజమానులుగా ఉన్నారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించడం.. ఆ తరువాత అనుమతులు లేకుండా బ్లాస్టింగ్స్ చేయడం జరుగుతంది. వీరి దందా.. వీరు చేస్తున్న అక్రమ వ్యాపారాలతో అమాయకులైన ప్రజలు ఏమైపోయినా వీరికి సంబంధం లేదు.. అక్రమ లే అవుట్ లు వేసి అమాయక ప్రజలకు అమ్ముతన్నా ఎవరూ వీరిని ప్రశ్నించరు.. ఏ అధికారి కూడా వీరి దరిదాపులకు వెళ్ళరు.. ఎందుకంటే వీరు అందరినీ మేనేజ్ చేస్తున్న తీరు.. నభూతో నభవిష్యత్ అనేలా సిస్టమ్ ని నడిపిస్తున్న వీరిద్దరి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందా..? వీరికి సహరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే బండారం బట్టబయలవుతుందా..? వీరి అడుగులకు మడుగులొత్తుతున్న అధికారుల పాపం పండుతుందా..? వేచి చూడాలి..

యాదాద్రి జిల్లా, రాజపేట మండలం, చల్లూరు విలేజ్ సర్వే నెంబర్ 322/4, బేగంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 216లోనూ.. అదే విధంగా మాసాయిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 726 లో గల ప్రభుత్వ భూముల్లో శ్రీ కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్, సాల్వో ఇండస్ట్రీస్, స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు చేస్తూ, రాజకీయ నాయకుల అండదండలతో అడ్డంగా దోచుకుంటున్నారు. అయితే మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన ప్రభుత్వ అధికారులు సైతం కబ్జా కోర్టులు విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇలా కబ్జా చేసిన భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముతుంటే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.. ఈ భారీ వ్యవహారం వెనుక తాజా ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు తెలుస్తోంది..
కాగా స్పెక్ట్రా కంపెనీపై ఐటీ దాడులు చేస్తే ఈ కంపెనీ నిర్వాహకులు ఎంత ఫైన్ కట్టారు..? తెలియాల్సి ఉంది.. అంతే కాకుండా రాజకీయ నాయకులకు ముడుపులిచ్చి ఆ కేసును ఏవిధంగా మాఫీ చేయించుకున్నారు..? అన్న వాస్తవం బహిర్గతం కావాల్సి ఉంది..

ఇక చల్లూరు గ్రామంలో 322/4లో స్పెక్ట్రా కంపెనీకి ఉన్న భూమి ఎంత..? అసలు ఈ సర్వే నంబర్లో ఈ కంపెనీకి ప్రస్తుత ఎమ్మెల్యే భూమి అమ్మింది ఎంత.. ? అలాగే యాదగిరి గుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో సర్వే నెంబర్ 726 స్పెక్ట్రా కంపెనీకి తాజా ఎమ్మెల్యే భూమి ఎలా అమ్మగలిగాడు..? గతంలో అది ప్రభుత్వ భూమి అన్నది నిర్విదాంశం.. గుట్టలు, కుంటలను నాశనం చేస్తూ.. పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు.. ఇది వాస్తవం..
ఈ సాల్వో ఇండస్ట్రీస్ కంపెనీ యజమాని శ్యాంసుందర్ రెడ్డి అలాగే ఆర్ఆర్ఎనర్జీస్ హైట్స్ ఎక్స్ ప్లోయింగ్ కంపెనీ జయరాం రెడ్డి ఈ ఇద్దరూ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ పంచన చేరుతారు.. ఇప్పుడు ఈ విషయం చర్చకు ఎందుకు వచ్చిందంటే.. మనం చెప్పుకుంటున్న సర్వే నెంబర్ 322/4లో సుమారు 160 ఎకరాల భూమి.. బీర్ల ఐలయ్య కంపెనీలు, అతని భాగస్వాముల కంపెనీల పేరుపై ప్రస్తుతము ఉన్నవి. ఇకపోతే ఇక కాకినాడ సి పోర్ట్ యజమాని అయిన కర్నాటి వెంకటేశ్వరరావు కూతురు కర్నాటి శ్రేయ పేరుమీద కూడా సుమారు 20 ఎకరాల భూమి కలదు.. శ్రీనాథ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ల పేరుమీద దాదాపు 400 ఎకరాలు కలదు.. దీనిలో 70 ఎకరాలకు శ్రీ కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్ పేరుపై ఉండగా ఇది ప్రభుత్వ భూమి.. ఈ భూమిలో అడ్డదారిలో పర్మిషన్ తీసుకుని అక్కడ ప్లాట్స్ వేసి సుమారు 600 మందికి అమ్మి వారిని బురిడీ కొట్టించారని తెలుస్తుంది..

అయినా 2021లో ఈ భూమిని అప్పటి జిల్లా కలెక్టర్ ప్రోబిటెడ్లో పెట్టారు. కానీ సాల్వో ఇండస్ట్రీస్ కంపెనీ పేరుపై 40 ఎకరాలు.. 2023లో 70 ఎకరాలకు జిల్లా అధికారులు, డిటిపిసి అధికారులు కుమ్మికై పర్మిషన్ ఇచ్చారు. వీరిపై ఎలాంటి చర్యలు లేవు..
ఇక కొలనుపాక దగ్గర ఎమ్మెల్యే అనుచరులపై డాక్యుమెంటు చేసిన యాదగిరిగుట్ట ఎస్.ఆర్.ఓ. గోపి సస్పెండ్ వెనుక ఏమి నిజం దాగివుంది.. ? ఇంతవరకు వెలుగులోకి రాలేదు. అసలు సాల్వో కంపెనీకి తాజా ఎమ్మెల్యేకు ఉన్న సంబంధాలేంటి? ఈ సాల్వో కంపెనీ రాజకీయ నాయకులకు ఒక వరంగా మారింది.. ఈ కంపెనీ చేసే పనులకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది..
నక్సలైట్లకు జెలిటిన్ స్టిక్స్ చేరవేస్తూన్నట్లు పలు మీడియా సంస్థలు వార్తా కథనాలు కూడా ప్రచురితమైయ్యాయి.. అదే విధంగా పలు పోలీస్ స్టేషన్లలో సాల్వో ఇండస్ట్రీస్ పై కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది. అక్రమ వెంచర్లలో బ్లాస్టింగ్లకు అనుమతులు లేకపోయినా, బ్లాస్టింగ్లు చేస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండా లంచాల మత్తులో అధికారులు జోగుతున్నారు. ప్రజలు ఎవరైనా మాట్లాడితే ఈ సాల్వో కంపెనీ యజమాని రౌడీలను, గూండాలు ఉసిగొల్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా క్రషర్ నడుపుతున్నది ఎమ్మెల్యే, అతని అనుచరులు అని తెలుస్తోంది..
మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా మీముందుకు రానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం అవినీతిపై అస్త్రం..