Tuesday, June 17, 2025
spot_img

అవినీతి రారాజు శ్రీనివాసులు

Must Read

ప్రభుత్వ భూముల పరాధీనంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు పాత్రా!

˜ అక్రమాల అడ్డాగా మారిన సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగం?
˜ ఉప్పల్‌ ఖాల్స భూ కుంభకోణం – శ్రీనివాసులు అవినీతికి అద్దం
˜ శ్రీనివాసులు అవినీతి అపారత్వం – వ్యవస్థాగత అవినీతికి నిదర్శనం?
˜ అవినీతిపరునికి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు బాధ్యతలు
అప్పగించారని విమర్శలు ˜ అవినీతికి పాల్పడి, తప్పుడు నివేదిక ఇచ్చిన
అధికారిపై చట్టపరమైన చర్యలకు సర్వత్ర డిమాండ్‌

రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌ మల్కాజ్గిరి జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న శ్రీనివాసులు అవినీతి పరాకాష్టకు చేరిందని, అతని అక్రమాలు రోజుకో రీతిలో వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. వందల కోట్ల రూపాయలు కూడబెట్టాడంటే, ఇతను ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ భూములను తప్పుడు సర్వే చేసి, అక్రమార్కులకు అప్పనంగా అప్పజెప్పడంలో ఈ ఘనుడు ఆరితేరాడు. ఈ అవినీతి వ్యవహారం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ముఖ్యంగా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగాన్ని, పౌరుల నమ్మకాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తోందో పరిశీలిద్దాం.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు (ఫైల్‌ఫోటో)

ఉప్పల్‌ ఖాల్స భూ కుంభకోణం – శ్రీనివాసులు అవినీతికి అద్దం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, ఉప్పల్‌ ఖాల్స గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 581/1లోని తొమ్మిది ఎకరాల ఒక గుంట ప్రభుత్వ భూమి పరాధీనం శ్రీనివాసులు అవినీతికి అద్దం పడుతోంది. అప్పటి సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు ఈ ప్రభుత్వ భూమిని గుర్తించి, కబ్జా వివరాలను, కబ్జాదారుల పేర్లతో సహా అప్పటి కలెక్టర్‌ మరియు ఉప్పల్‌ తహసిల్దార్‌కి నివేదించారు. ఈ నివేదిక ఆధారంగా, తహసిల్దార్‌ 9 ఎకరాల ఒక గుంట ప్రభుత్వ స్థలంలోంచి రెండు ఎకరాల ఒక గుంటను అక్రమార్కుల నుంచి స్వాధీనపర్చుకున్నారు. మిగతా ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికీ అక్రమార్కుల కబ్జాలోనే ఉంది. ఈ ఏడు ఎకరాలలో, హ్యాబిటెట్‌ నిర్మాణ సంస్థ మరియు భూ కబ్జాదారు రోహిత్‌ రెడ్డి సుమారు 31 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి, బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి, సుమారు 54 ఫ్లాట్లను అమాయక ప్రజలకు అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో, గతంలో నిర్వహించిన సర్వే రికార్డులను పక్కన పెట్టి, లంచాలకు ఆశపడిన మండల సర్వేయర్‌ వెంకటేష్‌ మళ్లీ సర్వే నిర్వహించి తప్పుడు నివేదిక ఇచ్చాడు. రోహిత్‌ రెడ్డి తన పట్టా భూమిలో నిర్మాణ పనులు చేస్తున్నారని, ప్రభుత్వ స్థలంలో కాదని తప్పుదోవ పట్టించే నివేదికను సమర్పించాడు. ఈ నివేదికపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని మోసగిస్తూ తప్పుడు నివేదిక ఇచ్చిన మండల సర్వేయర్‌ వెంకటేష్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌, సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈ దర్యాప్తులో, సర్వే అండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ మరియు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, సమగ్రంగా విచారించిన అనంతరం మండల సర్వేయర్‌ వెంకటేష్‌ అక్రమార్కులతో కలిసి తప్పుడు సర్వే చేసి తప్పుడు నివేదికను సమర్పించినట్లు స్పష్టం చేసింది.

సత్తెమ్మ (డిఐ)

ఈ నివేదిక ఆధారంగా, మండల సర్వేయర్‌ను సస్పెండ్‌ చేయడం, ఇంక్రిమెంట్‌ను తొలగించడం, మరియు అతని సర్వీస్‌ రికార్డులలో ఈ అక్రమ వ్యవహారాన్ని నమోదు చేయడం జరిగింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భూ కబ్జాదారు రోహిత్‌ రెడ్డి తన వక్రబుద్ధితో మళ్ళీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులును సంప్రదించి, భారీ ఎత్తున ముడుపులిచ్చి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, కీసర డివిజన్‌ అధికారిణి సత్తెమ్మతో రీ-సర్వే చేయించి మరో తప్పుడు నివేదికను ఇప్పించాడు. గతంలో మండల సర్వేయర్‌ వెంకటేష్‌ తప్పుడు నివేదిక ఇచ్చాడని, రోహిత్‌ రెడ్డి నిర్మిస్తున్న నిర్మాణం ప్రభుత్వ స్థలంలో కాదని, ప్రైవేట్‌ స్థలంలో నిర్మిస్తున్నాడని దర్యాప్తు అధికారి అయిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు తాను ఇచ్చిన నివేదిక సంగతిని మరిచిపోయి, అక్రమ సొమ్ముకు ఆశపడి రోహిత్‌ రెడ్డికి అనుకూలంగా తిరిగి రిపోర్ట్‌ ఇవ్వడం దారుణం.

ఈ విషయాన్ని గ్రహించిన జిల్లా కలెక్టర్‌, వెంటనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు ఇచ్చిన నివేదికను రద్దు చేస్తూ, అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఉన్నతాధికారులకు తెలియజేశారు. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులుపై చార్జెస్‌ ఫ్రేమ్‌ చేసి అధికారులు దర్యాప్తు చేయగా, అతనిపై మోపబడిన చార్జెస్‌ రుజువైనట్లు ఆర్డీడీ నివేదిక సమర్పించారు. శ్రీనివాసులు అవినీతి అపారత్వం – వ్యవస్థాగత అవినీతికి నిదర్శనం? ఇదే కాకుండా, బాచుపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 134, ఎర్రకుంట సర్వే రిపోర్ట్‌లో కూడా శ్రీనివాసులు తప్పుడు నివేదిక ఇచ్చాడని, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీనివాసులుపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కావడం, వెంటనే అతను అదృశ్యమవడం అతని నేరపూరిత స్వభావాన్ని రుజువు చేస్తుంది.

డైరెక్టర్‌ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన తప్పుడు నివేదిక.

ఇంతే కాకుండా రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లి మండలంలోని మీదికుంట చెరువు విషయంలోనూ శ్రీనివాసులు తప్పుడు నివేదిక ఇచ్చి, అక్రమార్కుల నుంచి భారీగా ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ అవినీతి అధికారి ఇప్పటికీ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీనిని బట్టి సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఉన్నతాధికారుల అండ శ్రీనివాసులుకు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బహుశా ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు అందిస్తున్నందునే, ఈ అవినీతిపరునికి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వానికే చెడ్డపేరు: ఉన్నతాధికారులు స్పందించరా?
ఈ విధంగా ఎన్నో అక్రమాలకు పాల్పడి వందల కోట్లు సంపాదిస్తున్న అత్యంత అవినీతిపరుడైన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు రంగారెడ్డి జిల్లాకు మరియు మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు బాధ్యతలు నిర్వర్తించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చే విధంగా ఉందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన మరియు తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారులపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు: అవినీతికి పాల్పడిన అధికారులు, తప్పుడు నివేదికలు సమర్పించిన అధికారులు, వారిపై మోపబడిన అభియోగాలు రుజువైనందున, వారిపై క్రింది చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు, తప్పుడు నివేదికను రద్దు చేస్తూ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు జారీ చేసిన లేఖ.


అవినీతి నిరోధక చట్టం, 1988 :
సెక్షన్‌ 7 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక విధులను నిర్వర్తించడానికి అక్రమంగా ఏదైనా ప్రయోజనాన్ని పొందడం లేదా స్వీకరించడం. దీని కింద, శ్రీనివాసులు లంచాలు స్వీకరించడం, తప్పుడు నివేదికలు ఇవ్వడం ద్వారా చేసిన ఆర్థిక ప్రయోజనాలు ఈ సెక్షన్‌ కిందకు వస్తాయి. ఈ నేరానికి 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.
సెక్షన్‌ 13(1)(డి): ప్రభుత్వ ఉద్యోగి తన పదవిని దుర్వినియోగం చేసి, తనకోసం లేదా ఇతరుల కోసం ఏదైనా విలువైన వస్తువును లేదా ఆర్థిక ప్రయోజనాన్ని పొందడం. శ్రీనివాసులు ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెట్టడం, వారికి అనుకూలంగా నివేదికలు ఇవ్వడం ఈ సెక్షన్‌ కింద తీవ్రమైన నేరం.

దీనికి కూడా 4 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.
సెక్షన్‌ 13(1)(ఈ): ప్రభుత్వ ఉద్యోగి తన ఆదాయ వనరులకు మించి ఆస్తులను కలిగి ఉండటం (అక్రమాస్తుల కేసు). శ్రీనివాసులు వందల కోట్ల రూపాయలు కూడబెట్టాడని ఆరోపణలు ఉన్నందున, ఈ సెక్షన్‌ కింద అతని ఆస్తులను విచారించి, అక్రమమని తేలితే స్వాధీనం చేసుకుని, శిక్ష విధించవచ్చు.
భారత శిక్షా స్మృతి, 1860 :
సెక్షన్‌ 166: ప్రభుత్వ ఉద్యోగి చట్టవిరుద్ధంగా వ్యవహరించి, ఇతరులకు హాని కలిగించడం. తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల ప్రజలకు జరిగిన నష్టం దీని కిందకు వస్తుంది. సెక్షన్‌ 193: తప్పుడు సాక్ష్యం ఇవ్వడం (ఫాల్స్‌ ఎవిడెన్స్‌). తప్పుడు సర్వే నివేదికలు సమర్పించినందుకు ఈ సెక్షన్‌ కింద శిక్ష విధించవచ్చు. దీనికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.
సెక్షన్‌ 420: మోసం (చీటింగ్‌). ప్రభుత్వ భూములను అక్రమంగా కట్టబెట్టి అమాయక ప్రజలను మోసం చేసినందుకు ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకోవచ్చు. దీనికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుంది.


సెక్షన్‌ 465, 468, 471: ఫోర్జరీ మరియు ఫోర్జరీ పత్రాలను నిజమైనవిగా ఉపయోగించడం. తప్పుడు సర్వే పత్రాలను సృష్టించి, ఉపయోగించినందుకు ఈ సెక్షన్ల కింద శిక్షలు విధించబడతాయి.
డిపార్ట్‌మెంటల్‌ ఎంక్వైరీ మరియు సర్వీస్‌ రూల్స్‌ : పై చట్టాల ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి (కండక్ట్‌ రూల్స్‌) మరియు సేవా నిబంధనల (సర్వీస్‌ రూల్స్‌) ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందులో సస్పెన్షన్‌, పదవి నుండి తొలగించడం, పెన్షన్‌ ప్రయోజనాలను నిలిపివేయడం వంటి చర్యలు ఉంటాయి. ఇప్పటికే మండల సర్వేయర్‌ వెంకటేష్‌పై తీసుకున్న చర్యలు (సస్పెన్షన్‌, ఇంక్రిమెంట్‌ తొలగింపు) ఇందుకు ఉదాహరణ. శ్రీనివాసులు విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలి, అవసరమైతే కఠినమైన శిక్షలు విధించాలి.


ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి, వెంటనే శ్రీనివాసులుపై అవినీతి నిరోధక దృష్టి సారించి, అతని అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, పైన పేర్కొన్న చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే, ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోవడం, అమాయక ప్రజలు మోసపోవడం, మరియు ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లడం అనివార్యం. ఈ వ్యవహారం కేవలం ఒక అధికారి అవినీతి మాత్రమే కాకుండా, వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతికి నిదర్శనం. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి, పారదర్శకమైన, జవాబుదారీతనం గల పాలనను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌ మల్కాజ్గిరి జిల్లాలో చేసిన అవినీతి బాగోతంపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.

Latest News

హరీష్‌రావుకు అస్వస్థత

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS