Wednesday, June 18, 2025
spot_img

కోట్ల విలువైన ప్రభుత్వ భూములు గోల్‌మాల్!

Must Read

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలంలో సర్కారీ భూములు గోల్ మాల్!

వ్యాపారులకు, నాయకులకు ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములను అమ్ముకున్న మండల రెవెన్యూ అధికారులు..

2018 నుండి 2022 వరకు తిరుమలగిరిలో రెవిన్యూ అధికారుల బరితెగింపు!

అసైన్మెంట్ కమిటీ లేదు, కలెక్టర్ ఆమోదం లేదు, పబ్లిక్ నోటీసు లేదు.. అంతా ఆగమాగం!

సర్వే నెం. 835, 826, 429లో అనేకమంది అనర్హులకు అసైన్డ్ పట్టాలు

మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రభుత్వ భూముల రికార్డులన్నీ గందరగోళం..

సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండల కేంద్రంలో నేడు కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 2018 నుండి 2022 వరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఒక పర్యవేక్షణ, పద్ధతి లేకుండా అడ్డగోలుగా కార్యాలయంలో రికార్డులన్నీ తారుమారయ్యాయి. ఏకపక్షంగా జరిగిన ఈ వ్యవహారానికి వెనుక ఉన్నది ఓ అధికారుల ముఠా వ్యవస్థ అనే ఆరోపణలు ఉన్నాయి. ధరణి వచ్చిన తరువాత, జిల్లా కలెక్టర్ కంట్రోల్ లోకి పూర్తిస్థాయి అధికారాలు నాటి ప్రభుత్వం కట్టబెట్టే ఈ మధ్యకాలంలో స్థానిక రెవెన్యూ అధికారులు ఇక్కడ ఇష్టారాజ్యాంగా ప్రవర్తించినట్లు అనేక ఆధారాలు లభ్యమవుతున్నాయి.

అధికారం చేతిలో ఉందనే అహంభావంతో కొన్ని ఎకరాల ప్రభుత్వ భూములను యదేచ్చగా అగ్రవర్ణ ప్రైవేటు వ్యాపారులకు, కొద్ది మంది స్థానిక నాయకులకు అమ్ముకొని అక్రమాలకు బరితెగించి, వారికి లావుని పట్టాలు మంజూరు చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్. 835, (ఖాత నెం. 60429)లో స్థానిక తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో వ్యాపారం నిర్వహించుకునే చెర్విరాల సుధాకర్ అనే ఓ బడా వ్యాపారికి నాడు ఇక్కడ ఇన్ చార్జీ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న
జి.హరిచంద్ర ప్రసాద్ (ప్రస్తుతం ఆత్మకూర్ (ఎం) మండలంలో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యాడు) అనే అధికారి తన కలం పోటుతో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యాపారికి ఈ ప్రభుత్వ భూమిని అక్రమ పద్ధతిలో, ఏకపక్షంగా అసైన్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఒక ఎకరానికి రూ.15 లక్షల చొప్పున చేతులు మారినట్లు వినికిడి.

ఇది ఇలా ఉండగా, దీనికి పూర్వం ఇదే సర్కారు భూమి సర్వే నెంబర్ 835 లో మాజీ మండలాధ్యక్షుని కుటుంబ సభ్యులందరికీ కలుపుకొని 5.30 ఎకరాలు ప్రభుత్వ భూములు అసైన్డ్ చేశారు. సర్వే.నెం.835లో సదరు మాజీ మండలాధ్యక్షుని భార్య పేరున 2.00 ఎకరాలు, వివాహితురాలైన(ఈమె భర్త ప్రభుత్వ ఉద్యోగి) ఆయన కూతురు పేరున సర్వే.నెం.835/1, 835/2, 835/6, 835/8 కలుపుకొని మొత్తం 3.30 ఎకరాల ప్రభుత్వ భూమిని లావుని పట్టాలుగా ఈయన కుటుంబానికి ధారాధత్తం చేసినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. 2018-19లో ఇదే భూమి సర్వే నెం.835/4లో మరో 3.00 ఎకరాల భూమిని స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్ కు అధికారులు అసైన్డ్ చేసినట్లు తెలుస్తోంది. సర్వే నెం.835లో అక్రమంగా అసైన్డ్ పట్టాలు పొందిన వీరందరికీ స్థానిక తిరుమలగిరిలో వారి పూర్వీకుల ద్వారా అనువంశిక పట్టా భూములు ఉండగా, వాటిని ఇతరులకు విక్రయించి మళ్లీ నిరుపేదల స్థానంలో వీళ్లంతా చౌకగా రాజకీయ ప్రయోగాల ద్వారా ఎకరాలకొద్ది ప్రభుత్వ భూములను ఈ విధంగా కొట్టేసినట్లు స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

అసైన్మెంట్ కమిటీ లేదు, కలెక్టర్ ఆమోదం లేదు, పబ్లిక్ నోటీసు లేదు.. అంతా ఆగమాగం!

తిరుమలగిరి మండలం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటివరకు సుమారు 8 సార్లు ఇక్కడ అసైన్మెంట్ కమిటీలు నిర్మాణం జరిగి, సదరు కమిటీల ద్వారా జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆమోదంతో అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి కొన్ని ఇండ్ల స్థలాలు, కొంత వ్యవసాయ భూములు అధికారికంగా అసైన్డ్ చేసినట్లు అధికారిక ప్రభుత్వ గజిట్ ద్వారా స్పష్టమవుతుంది. ఇవి మినహాయిస్తే, మిగిలినవన్నీ రెవిన్యూ అవినీతి అధికారులు సృష్టించిన బోగస్ రికార్డులేనని స్పష్టమవుతోంది.

సర్వే నెం. 826 లో ఎస్సీ, బిసీ సామాజిక వర్గాలకు చెందిన అనేకమంది అర్హులే ఇందులో అసైన్డ్ పట్టాలు పొందిట్లు తెలుస్తోంది. వీళ్లలో కొద్దిమందికి ఇందిరమ్మ హయాంలో అప్పటి ప్రభుత్వం లావుని పట్టాలు అధికారికంగా మంజూరు చేసిందని తెలిసింది. 2018-19లో ఇందులోకి కూడా కొంత మంది చోటామోటా నాయకులు చొరబడి,10-20 గుంటల చొప్పున కొన్ని అక్రమ అసైన్డ్ పట్టాలు సృష్టించుకున్నట్లు తెలుస్తోంది. వీరికి స్థానికంగా ఇతర ప్రాంతంలో సొంత పట్టా భూములు వీరి పేరునే ఉండటం గమన్హారం.

సర్వే నెం.429 లో ప్రభుత్వ భూములు ఫలహారం..

429 సర్వే నెంబర్ లో ప్రస్తుత ‘భూ భారతి’ రికార్డుల ప్రకారం మొత్తం ప్రభుత్వ భూమి 12.35 ఎకరాలుగా రికార్డులు చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక గుంట స్థలం కూడా రెవిన్యూ ఆధ్వర్యంలో ఉన్న దాఖలాలు కనిపించవు. సర్వే నెం.835, 826 కు చెందిన భూములు పూర్తిగా వ్యవసాయ భూములు కాగా, 429లో ఉన్న ప్రభుత్వ భూమి మొత్తం ఇండ్ల స్థలాలుగా, ఓపెన్ ప్లాట్లుగా మారిన స్వభావంతో కనిపిస్తుంది. ఈ భూమిలో గజం జాగ రూ.15-20 వేల వరకు ధర పలుకుతోంది. పేదలకు ఇళ్ల స్థలాలు అనే ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించిన ఓ ఎర్రజెండా లీడర్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారుల అండతో గజాల చొప్పున తనే సొంతంగా విక్రయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ భూమికి పక్కనే ఉన్న సర్వే నెం.430 కి చెందిన ఒక ప్రైవేటు పట్టాదారు, స్థానిక నాయకులు, అధికారుల అండతో ఎంచక్కా 429 లో ఉన్న ప్రభుత్వ భూమిని ముక్కలు ముక్కలుగా అమ్ముకుంటూ, అధికారిక రిజిస్ట్రేషన్ పత్రాల్లో మాత్రం భూమి సర్వే నెంబర్ 430 గా చూపిస్తున్నారని తెలిసింది. నూతనంగా ప్రజా పాలన ప్రభుత్వంలో వచ్చిన ‘భూ భారతి’ చట్టాన్ని కఠినంగా జిల్లా కలెక్టర్ అమలు చేసినట్లయితే, తిరుమలగిరి మండలంలో జరిగిన ప్రభుత్వ భూముల అక్రమ అసైన్మెంట్ ‘గోల్ మాల్’ దందా మొత్తం బయటికి వచ్చే అవకాశం ఉందని స్థానికులంతా ఆశిస్తున్నారు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS