బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
బీసీ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మెదక్ జిల్లా కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో నిర్వహిస్తామని తెలిపారు.

అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రైల్ రోకో చేపట్టి, ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీకి బిల్లు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. దాన్ని ఆమోదింపజేయించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.