ప్రధాని మోడీ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం : కవిత
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో తలెత్తే ముంపు సమస్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతో తలెత్తే ముంపు సమస్యలపై ఈనెల 25 ప్రధాని నరేంద్రమోడీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, ముంపు బాధితులు పాల్గొని మాట్లాడుతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే భద్రాచలం రామాలయంతో పాటు మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు గోదావరి తీరంలోని వందలాది గ్రామాలు ముంపునకు గురవుతాయని ఈ సమస్యలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. అలాగే భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు, భద్రాచలం సమీపంలోని ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకల పాడు గ్రామాలు ఏడు మండలాల విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కలిశాయని తెలిపారు. ఈ ఐదు గ్రామాలు ఏపీలో కలిసిన కారణంగా భద్రాచలం రాముడికి చెందిన వెయ్యి ఎకరాల భూములో ఏపీలో కలిశాయని, భద్రాచల రాముడు తెలంగాణలో ఉంటే ఆయన భూములు ఏపీలోకి వెళ్లాయిన్నారు. దీంతో ఈ ఐదు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆపద సమయాల్లో 80 కి.మీ.ల దూరంలో ఉన్న చింతూరు నుంచి అంబులెన్స్ రావడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ సమస్యలపై జాగృతి నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి ఈనెల 25న ప్రధాన మంత్రి అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో ప్రధాని ఎదుట పెట్టాల్సిన డిమాండ్లపై తీర్మానాలు చేస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలతో పాటు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.