- ప్రధాని మోడీ సమక్షంలో అంతర్జాతీయ యోగా
- 6 కిలోవిూటర్ల పొడవున యోగా విన్యాసాలకు ఏర్పాట్లు
- సుమారు పది వేల మంది పోలీసుల మోహరింపు
ఈ నెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణకు రంగం సిద్దం అయ్యింది. ప్రధాని మోడీ ఈ వేడుకలకు హాజరు కానుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు 5 లక్షల మందితో గిన్నిస్బుక్ రికార్డు నెలకొల్పేలా ఏర్పాట్లు చేశారు. అందుకే అంతర్జాతీయ యోగా సందర్భంగా ప్రభుత్వం విపరీత ప్రచారం చేస్తోంది. 26 కిలోవిూటర్ల మేర సాగే ఈ వేడుకలకు సుమారు ఎనిమిది వేల బస్సుల్లో జన సవిూకరణకు పూనుకుంటోంది. ఇప్పటికే ఈ యోగాంధ్ర కోసం విశాఖ సాగర తీరం మెత్తాన్ని భద్రతా కారణాల రీత్యా మూసివేశారు. అత్యంత అట్టహాసం, ఆర్భాటంతో యోగా డేను నిర్వహించి గిన్నిస్ బుక్లోకి ఎక్కాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. టిడిపి, బిజెపి, జనసేన రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఏడాది తర్వాత యోగా పేరుతో విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ భారీ యోగా డేకు భారీగా ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరం విూదుగా ప్రయాణాలు సాగించాలనుకునేవారు, రోజువారీ పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లే కార్మికులు చాలా మంది తమ ప్రయాణాలను గురువారం మానుకున్నారు. శనివారం ఐదు లక్షల మంది నగరానికి ఒకేసారి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఊహించుకుంటేనే భయంగా ఉందని అంటున్నారు. విఐపిలు ఆశీనులయ్యే కాళీమాత టెంపుల్ నుంచి పార్క్ హోటల్ వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. జనం యోగా చేసే ప్రాంతాల్లో టాయిలెట్లు, మంచినీరు, ఆహార ఏర్పాట్లను చేశారు.
యోగాంధ్ర పేరుతో ఏర్పాట్లు, పది వేల మందితో పోలీస్ బలగాల మోహరింపు తదితరాలతో పరిపాలన అంతా సాగర తీరానికే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. ట్రాఫిక్ డైవర్షన్ చేసి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ప్రధాని మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖలోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం ఆరు గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. తూర్పునౌకాదళం గెస్ట్హౌస్లో ప్రధాని బస చేస్తారు. 21న ఉదయం 6.25 గంటలకు ప్రధానిని చంద్రబాబు రిసీవ్ చేసుకుంటారు. ఏడు గంటల నుంచి 8.30 గంటల వరకూ బీచ్రోడ్డులో జరిగే యోగా డే వేడుకల్లో అంతా పాల్గొంటారు.
విశాఖపట్నం ఎయు కన్వెన్షన్ హాలు నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాలు వరకు యోగా వాక్థాన్ నిర్వహించారు. ఇందులో మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్, సవిత పాల్గొన్నారు. విశాఖ వేదికగా ఈ నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని, సాగరతీరంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సహకరించాలని మంత్రులు కోరారు. స్పెషల్ సిఎస్ ఎమ్టి.కృష్ణబాబు మాట్లాడుతూ.. మూడు దశల్లో యోగాపై పోటీలు నిర్వహించామని, 25 లక్షల మందికి సర్టిఫికెట్లు జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 126 మంది విజేతలుగా నిలిచారని, వారంతా ప్రధాని, ముఖ్యమంత్రితో పాటు ప్రధాన వేదికలో యోగాసనాలు వేస్తారని పేర్కొన్నారు.