రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తెలంగాణ రైజింగ్ – 2047 దార్శనికతతో ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ గారు లేఖ రాశారు.
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్ గారితో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. ఆ సందర్భంగానే తెలంగాణ రైజింగ్ (Telangana Rising 2047) విజన్ గురించి ముఖ్యమంత్రి గారు వివరించారు.

2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడం, పెట్టుబడులను ఆకర్షించడం, రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, ఇతర రంగాల్లో లక్ష్యాలు, వాటిని సాధించుకునే మార్గాలను వివరించారు.
ఈ భేటీ సందర్భంగానే తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు సంబంధించి టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ (TBIGC) సంస్థతో తెలంగాణ ప్రభుత్వం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ఒక ఒప్పందం చేసుకుంది.
తెలంగాణ రైజింగ్ విజన్లోని స్పష్టత, నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయంటూ తాజాగా రాసిన లేఖలో టోనీబ్లెయిర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ విజన్కు అనుగుణంగా లక్ష్యాల సాధనకు భారతదేశంలోని TBIGC ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరిస్తారని తెలిపారు.
తదుపరి కార్యాచరణపై ముందుకు వెళ్లడానికి ఏవైనా సందేహాలుంటే తెలంగాణ అధికారులు TBIGC భారత ప్రతినిధిని సంప్రదించవచ్చని ఆ లేఖలో టోనీబ్లెయిర్ గారు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.