- అధికారుల అండతో అరాచకం?
- హైదరాబాద్లో నవయుగ నయాదందా…!
- అనుమతులు ఒకచోట, నిర్మాణం ఇంకోచోట!
- కమిషనర్ గారూ, నవయుగ అక్రమాలపై చర్యలు ఎప్పుడు?
- ప్రజల నమ్మకం కోల్పోతున్న అధికార వ్యవస్థ!
- బేగంపేట్లో కబ్జా రాజకీయం.. నవయుగ అక్రమంపై రెవెన్యూ నివేదిక,
- టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం!
- రాజకీయ నాయకులకు తలొగ్గుతున్న వైనం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అదే వేగంతో అక్రమ నిర్మాణాలు, అక్రమార్కులు పెరిగిపోతుండడంతో నగర అభివృద్ధిని ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. ప్రణాళికలకు విరుద్ధంగా, నిర్మాణ నిబంధనలను పక్కనపెట్టి కొన్ని బహుళ అంతస్తులు నిర్మిస్తున్న ప్రభుత్వ అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాల నేపథ్యంలో అధికారుల పాత్రపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ, కమిషనర్ స్పందిస్తున్న తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్న తీరు, ముఖ్యంగా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ విషయంలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. “కలియుగంలో నవయుగ అరాచకం” పేరుతో 2025 జూన్ 18న ‘ఆదాబ్ హైదరాబాద్’ దినపత్రిక సంచలన కథనం ప్రచురించింది. అనుమతులు ఒకచోట తీసుకుని, నిర్మాణం మరోచోట చేపడుతున్న అక్రమ పద్ధతులను మరోసారి బట్టబయలు చేసింది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి అతి సమీపంలోనే ఇంత భారీస్థాయిలో అక్రమ నిర్మాణం జరుగుతున్నా, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
అనుమతి ఒకచోట, నిర్మాణం ఇంకోచోట
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బాలానగర్ మండలం, బేగంపేటలోని సర్వే నంబర్ 103/1, 103/2లో సుమారు 12,600 గజాల స్థలంలో 4 సెల్లార్+1 గ్రౌండ్+12 అప్పర్ ఫ్లోర్ నిర్మాణానికి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ 2022లో అనుమతులు పొందింది (పర్మిట్ నెంబర్: 2500/జీహెచ్ఎంసీ/సికింద్రాబాద్/2022 – బీపీ). అయితే, ఆశ్చర్యకరంగా, అనుమతులు పొందిన స్థలంలో కాకుండా, పక్కనే ఉన్న సర్వే నంబర్ 182లోని సుమారు 6000 గజాల స్థలాన్ని నిస్సిగ్గుగా ఆక్రమించి, అందులో భారీ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ అంశంపై రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి, బాలానగర్ తహసిల్దార్ను సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తహసిల్దార్ సమర్పించిన నివేదికలో నవయుగ నిర్మాణ సంస్థ సర్వే నంబర్ 103 మరియు 182లోని కొంత భాగంలో నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదిక, బాలానగర్ మండలానికి చెందిన సర్వేయర్, మండల గిర్దావర్ క్షేత్రస్థాయిని పరిశీలించిన అనంతరం సమర్పించిన ఉమ్మడి నివేదిక ఆధారంగా రూపొందించబడింది.

అధికారుల అంధత్వం వెనుక కుమ్మక్కు రాజకీయమా?
అనుమతులు ఒకచోట ఇచ్చి, నిర్మాణం మరోచోట జరుగుతున్నా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం వెనుక భారీ కుమ్మక్కు జరిగిందని ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాయడం అత్యంత దారుణం. ఇది పచ్చి అవినీతికి, అధికారుల అంధత్వానికి నిదర్శనంగా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. సర్వే సెటిల్మెంట్స్ అండ్ లాండ్ రికార్డ్స్ శాఖ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి కలిగిన అధికారి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తారు. ఏదైనా నిర్మాణ సంస్థ నుండి అనుమతుల కొరకు దరఖాస్తు పెట్టుకోగా వారి దస్తవేజుల ప్రకారం ఏ సర్వే నెంబర్లో అనుమతులు కోరుతున్నారో నిర్థారించి, టౌన్ప్లానింగ్ ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తారు. తదనంతరం టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణ సంస్థకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు బేగంపేట్లోని నవయుగ నిర్మాణ సంస్థ సర్వే నెంబర్ 103లో అనుమతులు తీసుకొని సర్వే నెంబర్ 182లో నిర్మాణం చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. లక్షల మంది ఆశలు, ఆస్తుల భవిష్యత్తును నిర్ణయించే అధికారులు ఇలా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇలాంటి అక్రమం జరుగుతుంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
కఠిన చర్యలు ఎందుకు లేవు?
రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా, సర్వే నంబర్ 103/1, 103/2కు అనుమతులు తీసుకుని, సర్వే నెంబర్ 182లోని కొంత భాగంలో (సుమారు 6000 గజాలు) నవయుగ నిర్మాణ సంస్థ అక్రమంగా నిర్మాణం చేపడుతున్నందున, దీనిపై తక్షణమే 1955 హెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలి. అక్రమంగా పొందిన నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేయాలి. లేనిపక్షంలో, అక్రమార్కులకు అధికారులు అండగా నిలుస్తున్నారనే వాదనకు మరింత బలం చేకూరుతుంది. ఈ అక్రమాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న బడా బాబులు, అధికారుల మధ్య ఉన్న సంబంధాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇలాంటి అక్రమాలను అరికట్టకపోతే, భవిష్యత్తులో నగరం మరింత అరాచకానికి గురయ్యే ప్రమాదం ఉంది.