Sunday, June 29, 2025
spot_img

అన్నపూర్ణ క్యాంటీన్‌ పేరు ఎలా మారుస్తారు?

Must Read

కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ కార్పోరేటర్లు, బిఆర్‌ఎస్‌ నేతల ధర్నా

అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్‌ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను గేటు బయటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బల్దియా ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు యత్నించారు. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారని.. అలాంటి వారికి కడుపునిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందన్నారు. పేరు మార్చాలని ఉద్దేశం ఉంటే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చిందన్నారు. ’ఆరు గ్యారెంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి.. మాకు అభ్యంతరం లేదు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్ధతి కాదు’ అని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ తెచ్చిన రాజశేఖర్‌ రెడ్డి పేరే తాము కొనసాగించడం జరిగిందన్నారు. అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తుకు వస్తారని.. అన్నపూర్ణ పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశం ఉంటే కౌన్సిల్‌ సమావేశంలో చర్చ పెట్టి, ఓటింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు. శనివారం పీజేఆర్‌ ఫ్లై ఓవర్‌ ఓపెన్‌ చేస్తున్నారని.. మరి అది కట్టింది ఎవరని ప్రశ్నించారు. తిమ్మిని బొమ్మను చేయడం కాంగ్రెస్‌ పార్టీకి అలవాటే అని విమర్శించారు. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు.

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS