- మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ల రాక
- మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుధవారం ఉదయం ఘటనా స్థలికి చేరుకున్నారు. మంత్రి వెంట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రమాద స్థలిని వారు పరిశీలించారు. అయితే అధికారుల ముందు బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. మంత్రి దామోదరతో బాధితులు వాగ్వాదానికి దిగారు. మూడు రోజులైనా తమ వారి ఆచూకీ చెప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు చేపడతామంటూ బాధితులను మంత్రి దామోదర రాజనర్సింహ సముదాయించారు.









అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సిగాచి ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయని.. 13 మంది మిస్సింగ్లో ఉన్నారని తెలిపారు. 11 మంది మృతదేహాలను అప్పగించామన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాక మిగిలిన మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని స్పష్టం చేశారు. కంపెనీ యజమాని అందుబాటులోకి వచ్చారని.. ఇప్పటికే కంపెనీపై కేసు నమోదు చేయించామన్నారు. మిగిలిన శిథిలాలు తొలగిస్తే మిగతా 11 మంది ఆచూకీ లభించే అవకాశం ఉందని మంత్రి దామోదర వెల్లడించారు.
ఈ ఘటనను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. బాధితులకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందని.. కంపెనీ నుంచి కూడా బాధితులకు నష్టపరిహారం అందజేసేలా చూస్తామని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కమిటీ వేశామని మీనాక్షి తెలియజేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మృతదేహాలను ప్రత్యేకంగా ఫ్రీజర్లలో మార్చురీలో భద్రపరిచామన్నారు. గాయపడిన వారికి కంపెనీ పరంగా ఆదుకుంటామన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మరోవైపు సిగాచి పరిశ్రమలో మూడోరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ క్రేన్లు, జేసీబీలతో శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. అయితే తమ వారి ఆచూకీ తెలియడంలేదంటూ ఘటనా స్థలిలో బంధువుల ఆందోళనకు దిగారు.