- బ్లడ్మనీకి అంగీకించేది లేదన్న మృతుడి సోదరుడు
- న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడి
- ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాధిత కుటుంబాన్ని బ్లడ్ మనీకి ఒప్పించేందుకు సమయం చిక్కిందని అంతా భావించారు. కానీ, అంతలోనే మృతుడి సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ బాంబు పేల్చాడు. నేరానికి క్షమాపణ అంటూ ఉండదని.. చేసిన తప్పుకు నిమిషకు శిక్ష పడాల్సిందేనని ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేశారు. తాము ఎలాంటి బ్లడ్ మనీని అంగీకరించమన్నారు. బుధవారం శిక్ష అమలు తాత్కాలికంగా నిలిపేసిన అనంతరం మృతుడి సోదరుడు ఫేస్ బుక్లో ఇలా పోస్ట్ చేశాడు. ఈ వాయిదాను మేం ఊహించలేదు. మా కుటుంబం రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రతిపాదనలు అన్నింటినీ తిరస్కరించింది. ఈ ప్రయత్నాలు మాకు కొత్తేమీ కావు. ఎన్ని విధాలా ఒత్తిడి చేసినా మేం మా అభిప్రాయాన్ని మార్చుకోం. బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదు. నా సోదరుడిని హత్య చేసిన ఆమెకు ఉరిశిక్ష పడితీరాల్సిందే. క్షమాపణ అనే మాటే లేదు. మాకు కావాల్సింది డబ్బు కాదు. న్యాయం అని పోస్ట్ చేశారు.
యెమెన్ చట్టం ప్రకారం, మరణించిన వ్యక్తి కుటుబం నిందితులను క్షమించి పరిహారానికి అంగీకరిస్తే శిక్షను రద్దు చేయవచ్చు. అందుకే ఈ విషయమై చాలా కాలం నుంచి భారత ప్రభుత్వం యెమెన్ స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్తో నిరంతర చర్చలు జరుపుతోంది. మరో పక్క మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ మృతుడి కుటుంబంతో క్షమాధనానికి ఒప్పుకునేందుకు తీవ్ర చర్చలు జరిపారు. నిమిష కుటుంబం బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.6కో) క్షమాధనం ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇక నిమిషకు బతికే అవకాశాలు లేవని ఆందోళన వ్యక్తం అవుతోంది.