- అలా చేస్తే.. నేనూ రాజీనామా చేస్తా
- సిఎం రేవంత్కు బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు సవాల్
బీజేపీ బీసీల పార్టీ అని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బీసీ వర్గానికి చెందినవారని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ బీసీని ముఖ్యమంత్రిగా నియమించాలి, అలా చేస్తే తాను కూడా పదవికి రాజీనామా చేస్తానని రామచందర్ రావు సవాల్ విసిరారు. కేంద్ర క్యాబినెట్లో 20 మంది బీసీలు ఉన్నారని గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్లకు 42 శాతం మద్దతు ఇస్తామని, ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే బీజేపీ సహకరిస్తుందని స్పష్టం చేశారు. బీసీల బిల్లులో 10 మంది ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా నర్సాపూర్లో జరిగిన కార్యక్రమంలోమాట్లాడారు. అంతకుముందు ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రరావు వెంట ఎంపి రఘునందనరావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.












అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ.. మతప్రాధాన్యత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుందని, బీజేపీ అవినీతి రహిత పాలన సాగిస్తోందని రామచందర్ రావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి పునర్వైభవం తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ కేవలం పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా బలంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇప్పటివరకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని, బీజేపీ ఒక్క పైసా ఇవ్వలేదన్న ఆరోపణలు కావాలని చేస్తున్నారని రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసపు హావిూలతో అధికారంలోకి వచ్చి, ఆరు గ్యారెంటీ-లను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రామచందర్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వం లో ఉమ్మడి మెదక్ జిల్లాకు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉన్నా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటికీ, మెదక్ జిల్లాకు అన్యాయం జరిగిందని అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త జాతీయ రహదారులు బీజేపీ వల్లే వచ్చాయని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపి రఘునందన్ రావు మాట్లాడుతూ బిజెపికి ఆదరణ పెరిగిందని, మోడీ పాలనపట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. జిల్లాల్లోనూ బిజెపి పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు.